మామిడికుదురు: మామిడికుదురు గ్రామానికి చెందిన బళ్ల జ్యోతి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం అందుకున్నారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గోదావరి ఉత్సవ్–2026’ జాతీయ ప్రతిభా పురస్కారోత్సవంలో భాగంగా జ్యోతికి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం ఆమె గోడితిప్ప ఎంపీయూపీ స్కూల్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. అమరావతి స్కూల్ ఎడ్యుకేషన్ జేడీ ఎస్.అబ్రహం చేతుల మీదుగా జ్యోతి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. డాక్టర్ అద్దంకి రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వసాయి శ్రీశ్రీ కళాపీఠం చైర్మన్ కత్తిమండ ప్రతాప్ తదితరులు పాల్గొని జ్యోతిని సత్కరించారు. ఆమెను ఎంఈఓలు కె.కిరణ్కుమార్, ఎస్.ఏడుకొండలు, హెచ్ఎం సూర్యచంద్రరావు, ఉపాధ్యాయులు అభినందించారు.
పిడుగుపాటుకు ధ్వజస్తంభం ధ్వంసం
రంగంపేట: చండ్రేడు గ్రామంలో కాత్యాయిని సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడటంతో ఆలయ ధ్వజస్తంభం ధ్వంసమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభంపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ధ్వజస్తంభం ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు.
గేదె మృతి..
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): పిడుగు పడి ఓ పాడి గేదె మృతి చెందిన ఘటన గొల్లప్రోలు మండలం చెందుర్తిలో చోటుచేసుకుంది. భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు, పలుచోట్ల పిడుగులు పడ్డాయి. చెందుర్తికి చెందిన దేవర ఆదినారాయణ పాడి గేదైపె ఆదివారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ గేదె విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని, అధికారులు ఆదుకోవాలని బాధిత రైతు ఆదినారాయణ కోరారు.
చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం
చేబ్రోలు రైస్మిల్లు సమీపంలో వర్షం, ఈదురు గాలులకు భారీ చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తండ్రి మృతి, కుమారుడికి గాయాలు
కొత్తపల్లి: పిడుగుపాటుకు తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాత ఇసుకపల్లి గ్రామానికి చెందిన పెంకే నూకరాజు (45), ఆయన కుమారుడు మణికంఠస్వామి పొలంలోకి వెళ్లారు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్న వారి సమీపంలో భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. నాగులాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మణికంఠ 10వ తరగతి చదువుతున్నాడు. అతన్ని కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వివాహిత అదృశ్యం
కరప: పాతర్లగడ్డకు చెందిన వివాహిత అదృశ్యమైంది. 5న దుకాణానికి వెళ్లి సామాన్లు తీసుకుని వచ్చేసరికి తన కుమార్తె లేదని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


