కంబాలచెరువు(రాజమహేంద్రవరం): గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు అంతరాష్ట్ర వ్యక్తులతో పాటు ఒక స్థానికుడిని ప్రకాశం నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, సంబంధిత పోలీసు అధికారుల పర్యవేక్షణలో సీఐ ఆర్ఎస్.బాజీలాల్, ఎస్సైలు జి.సతీష్, ఎస్ఐ కె.నవీన్ కుమార్ గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ సమీపంలో ఐదుగురు నిందితులను వారు అదుపులోకి తీసుకుని 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జాఫర్ చీకు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన రహత్ అలీ, హర్యానా రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్, సుమిత్ కుమార్ మిశ్రా, బీహార్కు చెందిన సందీప్ కుమార్, రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన షేక్ సాధక్ అలీ ఉన్నారు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ మూడో దఫా సమావేశం కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదించిన దరఖాస్తులపై కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులతో పరిశీలించి సూచనలు ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులపై సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు.


