అగరబత్తీల ప్యాకింగ్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటి వద్దే ఉంటూ వేలకు వేలు సంపాదించండంటూ ప్రచారం చేసి అగరబత్తీల ప్యాకింగ్ పేరుతో వందల మందిని మోసం చేసి రూ.కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా నిరసన వ్యక్తం చేశారు. పలు జిల్లాల నుంచి స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న బాఽధితులంతా మంగళవారం మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఆయా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదని, బాఽధితులంతా రాజమహేంద్రవరం చేరుకుని నిరసన చేపట్టామన్నారు. దీంతో రాజమహేంద్రవరంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. అయితే సత్యసాయి ఎంటర్ ప్రైజస్ నిర్వాహకుడు మోహన్కృష్ణ ఫోన్, వాట్సాప్లలో అందరికీ టచ్లో ఉంటున్నాడని, పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 బ్రాంచ్లు ఏర్పాటు చేసి మేనేజర్లను నియమించి కోట్ల రూపాయలు స్వాహా చేసి ఆ సొమ్ముతో భూములు కొనుగోలు చేశారన్నారు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చిందని మోహన్ కృష్ణ అబద్దం చెబుతున్నాడని, సొమ్ము ఆలస్యంగా కొద్ది కొద్దిగా అందరికీ చెల్లిస్తానని చెప్పి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని తమను మోసం చేయాలని చూస్తున్నాడన్నారు. దీనిపై తామంతా పోరాడతామని, పోలీసులు తమ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై త్రీటౌన్ సీఐ వి.అప్పారావు బాధితులతో మాట్లాడారు. కేసు నమోదు చేశామని, మోహన్కృష్ణ ఆచూకీ తెలుసుకుంటున్నామన్నారు. త్వరలోనే అతనిని అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు.


