రేపు అపెక్స్–కేఎస్పీఎల్ మారథాన్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ‘ఆమె భద్రత–మన బాధ్యత’ అనే నినాదంతో అపెక్స్–కాకినాడ సీపోర్ట్స్ (కేఎస్పీఎల్) మారథాన్–2026 నిర్వహిస్తున్నట్లు కాకినాడ రన్నర్స్ ట్రస్టు ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ సుధా కేశవరాజు తెలిపారు. ఎన్టీఆర్ బీచ్ నుంచి ఉప్పాడ వరకూ 4 కేటగిరీల్లో ఈ మారథాన్ రన్ జరుగుతుందన్నారు. ఈ రన్కు సంబంధించిన మెడల్స్, టీ–షర్ట్స్ ఆవిష్కరణ, కార్యక్రమ నిర్వహణ సన్నాహక సమావేశం స్థానిక జీఆర్టీ గ్రాండ్ హెూటల్లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా సుధా కేశవరాజు మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 5.30 గంటలకు మారథాన్ రన్ ప్రారంభమవుతుందని తెలిపారు. తొలుత 21.1 కిలోమీటర్ల పరిధికి, 6 గంటలకు 10 కిలోమీటర్లకు ఆఫ్ మారథాన్, 6.30 గంటలకు 5 కిలోమీటర్లకు మారథాన్, అదే సమయానికి 3 కిలోమీటర్ల ఫన్ రన్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి దాదాపు 1,500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మారథాన్ రన్లో పాల్గొనే వారి కోసం, హైడ్రేషన్, వైద్య సహాయం, రెడ్క్రాస్ వలంటీర్ల సహకారంతో పాటు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. మారథాన్ రేస్ డైరెక్టర్, కాకినాడ రన్నర్స్ ట్రస్టీ కమాండెంట్ ఎన్ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మారథాన్ రన్ను 50 ఏళ్లలోపు ఓపెన్ కేటగిరీలోను, 50 ఏళ్లు పైబడిన వారికి వెటరన్ కేటగిరీలోను నిర్వహిస్తామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని చెప్పారు. ఈ మారధాన్ ఎనిమిదోసారి ఇక్కడ జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కేఎస్పీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్ల మురళీధర్, అపెక్స్ సంస్థ ప్రతినిధి మాధవి, సంకురాత్రి ఫౌండేషన్ రమణమూర్తి, జీఆర్టీ గ్రాండ్ జీఎం రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


