దౌర్జన్యంగా గుడిసెల పీకివేత
● రక్షణ కల్పించాలంటూ
వలస కూలీల వినతి
● ఫిర్యాదు చేసి ఐదు రోజులైనా
పట్టించుకోని పోలీసులు
నల్లజర్ల: పోరంబోకు భూమిలో తాము వేసుకున్న తాత్కాలిక గుడిసెలను పీకేశారని, తమకు రక్షణ కల్పించాలంటూ వలస కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి ఐదురోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబరుపేట గ్రామానికి చెందిన 30 మంది వలస కార్మికులు వర్జీనియా పొగాకు (బ్యారను) రెల్చే పనుల కోసం నల్లజర్ల మండలం పోతవరం వచ్చారు. ఏటా మాదిరాగానే బహిరంగ ప్రదేశంలో తాటాకులతో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని పగలు పనులకు వెళ్లి రాత్రిళ్ళు ఇక్కడ పడుకుంటారు. ఈ పనులన్నీ నాలుగు మాసాలలో ముగుస్తాయి. అపుడు వీరు తమ స్వగ్రామాలకు వెళ్లిపోతారు. గత నెల 19న వచ్చిన వీరు గ్రామంలో ఏలేటి శ్రీను పొలంపక్క గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఈ నెల 14న అదే గ్రామానికి చెందిన రైతులు అట్టూరి సత్యనారాయణ, అట్టూరి వంశీ మగ కూలీలు పొలం పనులకు వెళ్లిన సమయంలో వారి తాత్కాలిక గుడిసెలు పీకేశారు. వండు కున్న ఆహార పదార్థాలను చిందర వందర చేసి నేలపై పడేశారు. గుడిశెలు ఇక్కడ తీయకపోతే మిమ్మల్ని కూడ పెట్రోలు పోసి తగులబెడతామని హెచ్చరించి వెళ్లిపోయారు. అయ్యా మేం పర్మినెంట్గా ఇక్కడ ఉండిపోమని, పనులు పూర్తయ్యాక ఖాళీ చేసి వెళ్లిపోతామని చెప్పినా వినకుండా మమ్మల్ని కులం పేరుతో దూషించారని బాధిత మహిళలు మొగులూరి చిట్టెమ్మమొగులూరి నాగలక్ష్మి,శ్రావణి తదితరులు వాపోయారు. ఒకపక్క రైతుల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాం పనులు పూర్తి చేసిపోతామన్నా వినలేదని చెప్పారు. ఇప్పటికే చాలామంది కూలీలు తమ ఊళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. మిగిలిన తమపై ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక భయంతో ఉన్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 22న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని, కనీసం ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయలేదని వాపోయారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు చిడిపి చింతయ్య బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఎస్సై ఆంజనేయబాబును ‘సాక్షి’ వివరణ కోరగా సమస్యను పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించినట్టు చెప్పారు.


