
ఉద్యోగాలు కోల్పోయి ఏడో నెలొచ్చినా..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఉన్నా ఉద్యోగాలు కోల్పోయి ఏడో నెలొచ్చినా వైద్య ఆరోగ్యశాఖలోని ఆరోగ్య సహాయకులు విశాఖపట్నంలో జరుగుతున్న యోగా వేడుకల్లో పాల్గొనేందుకు కదిలారని ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జీ.వీ.వీ.ప్రసాద్ అన్నారు. ఆయన గురువారం విశాఖపట్నం వెళుతూ రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో ఆరోగ్య సహాయకులుగా ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న దాదాపు వెయ్యి మందిని కోర్టు ఆదేశం పేరుతో విధుల నుంచి తొలగించడంతో రోడ్డున పడ్డారన్నారు. నెలలు గడుస్తున్నా నేటికీ విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన చెందారు. ఉన్నతాధికారుల మాటల ఊరటతో తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని ఏడు నెలలుగా ఎదురుచూపులు చూస్తున్నామన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విశాఖలో జరుగుతున్న శ్రీయోగాంధ్ర విజయం కోసం.. ఆరోగ్యాంధ్రా సాధన కోసం్ఙ ఉద్యోగాలు కోల్పోయిన ఆరోగ్య సహాయకులు వందలాదిగా తరలి వెళుతున్నారని ప్రసాద్ చెప్పారు. వరదలు, తుపానులు వచ్చినప్పుడు మేము చేసే సేవలు అనంతమని, అదే సేవా స్ఫూర్తితో స్వచ్ఛంధ సేవకు ముందుకురావడం ఆరోగ్య సహాయకులు పెద్ద మనస్సుకు నిదర్శనమని ప్రసాద్ కొనియాడారు. ప్రభుత్వం ఇప్పటికై నా కనికరించి త్వరితగతిన తిరిగి ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని వారు కన్నీళ్లతో అభ్యర్థిస్తున్నారన్నారు.