పిఠాపురం: మండలంలోని విరవ వద్ద గురువారం సంభవించిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు పిఠాపురం రూరల్ పోలీసులు తెలిపారు. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. పిఠాపురం మండలం మల్లాంకు చెందిన కాలదార రాజబాబు ఆటో డ్రైవరు, గుద్దాటి చినబాబు, కాలదార రమేష్, విరవకు చెందిన గాలింక కన్నబాబు మల్లాంలో జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొన్నారు. శుభకార్యం పూర్తయిన వెంటనే తమ ఆటోలో సరదాగా అలా తిరిగి వద్దామంటూ మల్లాం నుంచి విరవ బయలుదేరారు.
ఆటో విరవ సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ఐషర్ వ్యాన్ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న కాలదార రాజబాబు (40) అక్కడికక్కడే మృతి చెందగా గాలింక కన్నబాబు, కాలదార రమేష్, గుద్దాటి చినబాబులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుత్రికి తరలించారు. మార్గమధ్యలో గాలింక కన్నబాబు (43) మృతి చెందాడు. గుద్దాటి చినబాబు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పిఠాపురం రూరల్ ఎస్సై జాన్బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాజబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఒకరు ఆటో డ్రైవరు కాగా మిగిలిన ముగ్గురు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

మూడు కుటుంబాల్లో విషాదం

మూడు కుటుంబాల్లో విషాదం

మూడు కుటుంబాల్లో విషాదం

మూడు కుటుంబాల్లో విషాదం