
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
పెదపూడి: మోటార్ సైకిల్, స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఏఎస్సై శ్రీనివాసు తెలిపిన వివరాల ప్రకారం.. సామర్లకోట మున్సిపాల్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుడిపూడి శ్రీనివాస్ (51) తన బంధువులను పరామర్శించేందుకు గురువారం రాయవరం మండలం కురకాళ్లపల్లి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలోని ఇటుకల బట్టీ వద్ద రామచంద్రపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జి.మామిడాడ నుంచి స్కూటీపై వస్తూ ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివా్స్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో పెదపూడి సామాజిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్కూటీపై వెళుతున్న వారికి గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదుపై ఏఏస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పారిశుధ్య కార్మికులకు రెండ్రోజుల్లో జీతాలు
అన్నవరం ఆలయ ఈఓ సుబ్బారావు ఆదేశం
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని 349 మంది పారిశుధ్య కార్మికులకు ‘మే’ నెల జీతాలను రెండ్రోజుల్లో చెల్లించాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఆదేశించారు. జీతాలు వరుసగా మూడో నెల కూడా ఆలస్యం అవడంపై గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘వేతనాల ఆలస్యం రివాజే !’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై ఈఓ అధికారులను ప్రశ్నించారు. పారిశుధ్య కాంట్రాక్టర్ రూ.59 లక్షలకు బిల్లు ఇన్వాయిస్ ఈ నెల 14న ఇచ్చాడని, దాని ఆధారంగా బిల్లు సిద్ధం చేసి బుధవారం ఆడిట్కు పంపించగా అక్కడ కొర్రీ పడిందని, దానికి ఆన్సర్ చేసి మళ్లీ ఆడిట్కు పంపించామని అధికారులు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఆడిట్ క్లియర్ అయి వచ్చిన వెంటనే బిల్లు మొత్తాన్ని కాంట్రాక్టర్ అకౌంట్కు జమ చేసి వెంటనే పారిశుధ్య సిబ్బందికి చెల్లించే ఏర్పాటు చేస్తామని వారు వివరించారు. జూన్ నెల జీతాలు చెల్లించేందుకు సకాలంలో కాంట్రాక్టర్ బిల్లు ఇన్వాయిస్ పంపేలా చర్యలు తీసుకోవాలని ఈఓ ఆదేశించారు.
గురుకులాల్లో మిగిలిన
సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ సిటీ: కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్ల అడ్మిషన్ల కోసం దరఖాస్తులను కోరుతున్నామని జిల్లా సమన్వయ అధికారి ఎస్.శైలజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి ఆయా పాఠశాలల్లో ఈ దరఖాస్తుల స్వీకరిస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్ష కేంద్రం బాలికలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల సాంబమూర్తినగర్, కాకినాడ, బాలురకు అంబేడ్కర్ గురుకుల పాఠశాల లక్ష్మీనరసాపురంలో నిర్వహిస్తామన్నారు.