
లారీ ఢీకొని వ్యాపారి మృతి
కడియం: మండలంలోని వేమగిరి వద్ద జాతీయ రహదారిపై గురువారం లారీ ఢీకొని అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సత్తి శివానందరెడ్డి (43) మృతి చెందారు. కడియం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వ్యాపారం నిమిత్తం శివానందరెడ్డి ఉదయం ఇంటి నుంచి మోటారు సైకిల్పై రాజమహేంద్రవరం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా వేమగిరి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ మోటారు సైకిల్ను బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన వేగానికి శివానందరెడ్డి చక్రాల మధ్యకు వెళ్లిపోవడంతో ఆయనను కొద్దిదూరం లారీ ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. దీంతో శరీరంపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడియం ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.