అమలాపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈనెల 10న జైలు భరోతో పాటు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. స్థానిక ఎంప్లాయిస్ హోమ్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ అధ్యక్షతన పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సోమవారం జరిగిన సమావేశంలో సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈనెల 10న జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపాలని, అవసరమైతే అరెస్ట్లు, జైళ్లకు వెళ్లేందుకు కూడా వెనకాడకూడదని సుబ్బారావు సూచించారు. పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కారెం వెంకటేశ్వరరావు, టి.నాగ వరలక్ష్మి, మలకా సుభాషిణి, పీతల రామచంద్రరావు, సఖిలే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


