ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న మిగులు జలాలు
● మూడు రోజుల్లోనే సముద్రంలోకి పయనం
● వృథాగా పోయిన గోదావరి నీరు
● జూన్ 1 నుంచి జూలై 31 వరకు
కలిసింది 75.527 టీఎంసీలే
సాక్షి, అమలాపురం: రెండు నెలల పాటు వట్టిపోయిన గోదావరి.. మూడు రోజులు ఉగ్రరూపం దాల్చింది. దీంతో జులై 31వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఆగస్టు 3వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఏకంగా 303 టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయింది. రెండు నెలల కాలంలో ఉన్న సర్ప్లస్ మూడు రోజుల సమయంలో ఐదు రెట్లు పెరిగింది. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి గత నెల 31 నుంచి పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి వరకు 136.034 టీఎంసీల నీరు బ్యారేజీకి రాగా, 60.507 టీఎంసీలను గోదావరి డెల్టాలోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు వదిలారు. మిగిలిన 75.527 టీఎంసీలను సముద్రంలోకి విడిచిపెట్టారు. జూలై 31 నుంచి 3వ తేదీ వరకు మొత్తం 441.986 టీఎంసీల నీరు బ్యారేజీకి చేరింది. దీనిలో 62.805 టీఎంసీలను మాత్రమే మూడు కాలువలకు ఇచ్చారు. మిగిలిన 379.181 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. ఈ మూడు రోజులు కాలువలకు 2.298 టీఎంసీలు విడుదల చేయగా, సముద్రంలోకి 303.654 టీఎంసీలు వదిలేశారు. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్న కారణంగా ఇంకా పెద్ద ఎత్తున వరద జలాలను సముద్రంలోకి వదిలేయనున్నారు.
కాలువ పేరు జూలై 31 వరకు ఆగస్టు 3 వరకు
ఇచ్చింది ఇచ్చింది
తూర్పుడెల్టా కాలువ 19.606 20.712
మధ్యడెల్టా కాలువ 10.736 11.064
పశ్చిమ డెల్టా కాలువ 30.165 31.029
సముద్రంలోకి వదిలింది 75.527 379.181
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి జూన్ 1 నుంచి జూలై 31 వరకు, జూలై 31 ఉదయం ఆరు
గంటల నుంచి ఆగస్టు 3వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు కాలువలకు... సముద్రంలోకి నీరు విడుదల ఇలా (టీఎంసీలలో)


