అమలాపురం రూరల్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై జిల్లాలోని అన్ని నియోజక వర్గాల వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ప్రసాద్, కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం విలేకరులతో జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు తొత్తుగా మారి, సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళలను కించపరుస్తూ కథనాలు రాయడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రమే చెల్లిందన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటనే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ అమలాపురం, రామచంద్రపురం నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ, మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి రామ్ గోపాల్, కుడుపూడి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్ రాజు, అమలాపురం పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య కుమార్, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, టి.లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి చొల్లంగి సుబ్బురామ్, సాకా ప్రసన్న కుమార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్య నాగేంద్రమణి, దాసరి డెవిడ్ పాల్గొన్నారు.
వార్డుల పునర్విభజన నిష్పక్షపాతంగా జరగాలి
అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలని కోరుతూ పార్టీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాశ్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి కలెక్టర్ మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల పునర్విభజన చట్ట ప్రకారం జరగడం లేదని, నిబంధనలను పక్కన పెట్టి కూటమి నాయకుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
మహిళలను కించపరిచినా పట్టించుకోరా
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
మాజీ మంత్రి విశ్వరూప్, కో ఆర్డినేటర్లు శ్రీకాంత్, సూర్యప్రకాశ్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు
మహిళా లోకాన్ని అవమానించినట్టే..
అల్లవరం: మహిళలను అవమానపరిచేలా, వారి గౌరవాన్ని కించపరిచేలా తప్పుడు కథనాల ప్రచురించిన ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాధాకృష్ణపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం మహిళా లోకాన్ని అవమానించేనట్టేనని తెలిపారు.


