అమలాపురం రూరల్: అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని నోటీసుల సాకుతో తొలగించాలని చూస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, పార్టీ అమలాపురం కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాంత్ నేతృత్వంలో గ్రామానికి చెందిన దళిత సంఘాలు, నాయకులు, గ్రామస్తులతో కలిసి శనివారం కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. విగ్రహాన్ని తొలగించడం ద్వారా స్థానికుల మనోభావాలు దెబ్బతింటాయని, గ్రామ వాసులకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని, ఈ విషయంలో అధికారులు పునరాలోచించి విగ్రహాన్ని యథాతథంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పుణ్యమంతుల రజనీ, మాజీ సర్పంచ్ సాధనాల వెంకటరావు, అమలాపురం రూరల్ జెడ్పీటీసీ పందిరి శ్రీహరి రామ్గోపాల్, పెనుమల విక్రమ్ పాల్గొన్నారు.


