కొత్తపేట: స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఏ శ్రీసత్య రమాదేవి జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో గర్ల్స్’ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ) గా పదోన్నతి పొందారు. కలెక్టర్ సూచన మేరకు డీఈఓ పీ నాగేశ్వరరావు నుంచి రమాదేవి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఆమె గత ఏడాది సెప్టెంబర్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీటీ) ఉమెన్ విభాగం జిల్లా సెక్రటరీగా నియమితురాలై కొనసాగుతున్నారు.
సముద్ర కోత నివారణకు తోటల పెంపకం
అమలాపురం రూరల్: అల్లవరం మండలం ఓడలరేవు తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టడానికి తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. గురు వారం ఓఎన్జీసీ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి భూసేకరణ, భూపరిహారాలు చెల్లింపు అంశాలపై సమీక్షించారు. ఈ తీర ప్రాంతానికి రక్షణ కవచంలా నిలిచేలా తోటల పెంపకం కోసం 10.5 ఎకరాలు సేకరించామని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఓఎన్జీసీ అందుబాటులో ఉన్న వేరే భూమిని కొనుగోలు చేసి అప్పగిస్తుందన్నారు. జిల్లా అటవీ అధికారి ఎన్వీ ప్రసాదరావు, ఓఎన్జీసీ ప్రతినిధులు, భూసేకరణ సెక్షన్ సూపరింటెండెంట్ సుబ్బరాజు పాల్గొన్నారు.
23వ తేదీ వరకు పోషణ్ పఖ్వాడా
జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిదవ పోషణ్ పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం పోషణ్ పఖ్వాడా గోడ పత్రికను కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సెల్ఫోన్, టీవీ స్క్రీన్లను చూసే సమయాన్ని తగ్గించడం ఈ ఏడాది పోషణ్ పఖ్వాడా ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐసీడీఎస్ పీడీ కే.నాగమణి, డీఈవో పీ నాగేశ్వరరావు, అదనపు డీఎంఅండ్ హెచ్ వీ.భరతలక్ష్మి, డీఆర్డీఏ పీడీ రాంబాబు, సీడీపీవోలు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం
రూ.4.31 లక్షలు
పెరవలి: అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా రూ.4.31 లక్షల ఆదాయం వచ్చింది. అధికారులు, బోర్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలో హుండీలను గురువారం తెరిచి, 43 రోజులకు గాను ఆదాయాన్ని లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీల ద్వారా రూ.4,25,969, అన్నదాన హుండీ ద్వారా రూ.5,089 కలిపి మొత్తం రూ.4,31,058 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. త్వరలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని, దీనికి దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీ రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


