గన్నవరపు శ్రీనివాసరావు
పి.గన్నవరం: మహిళలపైన, వైఎస్సార్ సీపీ నేతల కుటుంబాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ చానల్ ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏబీఎన్ చానల్లో మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణకు గన్నవరపుతో పాటు, నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. తక్షణమే కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం కోఆర్డినేటర్ గన్నవరపు విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో మహిళలను ఎంతో గౌరవిస్తారని, కానీ ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం మహిళలను అవమానిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ తన అహంకారాన్ని వీడి మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మహిళలపై ఏబీఎన్ చానల్లో ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబుకు రాధాకృష్ణ బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో మహిళలే అతనికి తగిన బుద్ధి చెబుతారన్నారు. రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని, రాధాకృష్ణ డౌన్, డౌన్ అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో మండల శాఖ అధ్యక్షుడు కొమ్ముల రాము, పార్టీ రాష్ట్ర నాయకులు అడ్డగళ్ల వెంకట సాయిరామ్, ఇందుకూరి నరసింహరాజు, వాసంశెట్టి తాతాజీ, నక్కా వెంకటేశ్వరరావు, జక్కంపూడి వాసు పాల్గొన్నారు.


