● డాక్టర్ బీఆర్ అంబేద్కర్
మనవడు యశ్వంత్ అంబేడ్కర్
● ఎ.వేమవరప్పాడులో
అంబేడ్కర్ శిలా విగ్రహావిష్కరణ
అమలాపురం రూరల్: నేటి పాలకులు మనువాదాన్ని అమలు చేసే దిశగా కుట్ర చేస్తున్నారని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు యశ్వంత్ అంబేడ్కర్ ఆరోపించారు. అమలాపురం రూరల్ వేమవరప్పాడులో అంబేడ్కర్ శిలా విగ్రహావిష్కరణ, 135వ జయంతి మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సింహాసనం మీద కూర్చున్న అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆర్పీఐ ప్రధాన కార్యదర్శి డీబీ లోక్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో పేద ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఆయన ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని అందరివాడు అని అన్నారు. మరో నాగపూర్గా పేరుపొందిన కోనసీమ జిల్లాలో వేలాది అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయనపై ఎనలేని అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవి ప్రసాద్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. జిల్లా దళిత ఐక్యవేదిక నాయకులు జంగా బాబురావు, ఇసుక పట్ల రఘుబాబు, ఎంఏకే భీమారావు, కొంకి రాజామణి, పుణ్యమంతుల రజిని, ఈతకోట నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పందిరి విజయ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


