కూనవరమే శాపం! | - | Sakshi
Sakshi News home page

కూనవరమే శాపం!

Jun 19 2025 7:42 AM | Updated on Jun 19 2025 7:42 AM

కూనవర

కూనవరమే శాపం!

సాక్షి, అమలాపురం: కోనసీమ తీర ప్రాంతంలోని వరి ఆయకట్టు రైతులకు ఖరీఫ్‌ సాగుకు మరో అవాంతరం ఏర్పడింది. ఏటా ముంపునకు భయపడి ఇక్కడి రైతులు సాగు వదిలేస్తున్న విషయం తెలిసిందే. కాని ఈసారి మరింత మంది సాగుకు దూరమయ్యే పరిస్థితిని సాగు, మురుగునీటి పారుదల శాఖ అధికారులు కల్పిస్తున్నారు. కాలువపై మరమ్మతులు, నిర్మాణాల పేరుతో నీరు ఆలస్యంగా వదలడం ద్వారా సాగునీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు సాగుకు అటంకాలు సృష్టిచారు. సముద్ర నీరు డ్రైన్లలోకి పారేలా చేసి మురుగు నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు తొలకరి సాగు అంటేనే భయపడేలా చేస్తున్నారు.

కోనసీమ జిల్లాలో కూనవరం, వాసాలతిప్ప, శంకరగుప్తం డ్రెయిన్ల నుంచి సముద్ర మొగ ద్వారా ముంపునీరు దిగాల్సి ఉంది. ఇదే ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. భారీ వర్షాల సమయంలో ఇవి మూసుకుపోవడం... తెరిస్తే ఉప్పునీరు పోటెత్తి చేలను, తోటలను ముంచెత్తడం పరిపాటిగా మారింది. కూనవరం మొగ సైతం ఇదే విధంగా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ముమ్మిడివరం, అమలాపురం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల పరిధిలో సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టుకు చెందిన ముంపునీరు ఈ మొగ ద్వారా సముద్రంలోకి దిగాలి. ఇప్పుడు వరి ఆయకట్టు తగ్గినా ఇంకా 25 వేల ఎకరాల సాగవుతోంది. మొగ తరచూ మూసుకు పోతున్న విషయం తెలిసిందే. దానికి ఇరువైపులా ఉన్న ఉప్పలగుప్తం, చిర్రయానాం, అల్లిపర్రల ద్వారా ముంపునీరు దిగేందుకు అక్రమ ఆక్వా చెరువులు సాగు అడ్డంకిగా మారింది. వందల ఎకరాలు ఏటా ముంపుబారిన పడి రైతులు నష్టపోతున్నారు. దీనితో ఈ ప్రాంతంలో ఏటా ఖరీఫ్‌లో మూడు వేల ఎకరాల నుంచి ఐదు వేల ఎకరాల్లో వరిసాగు వదిలేస్తున్నారు.

ఇసుక తవ్వకాలతో తెరుచుకున్న మొగ

కూనవరం మొగ ద్వారా ముంపునీరు సముద్రంలోకి దిగేందుకంటూ మురుగునీటి పారుదల శాఖ అధికారులు ఇటీవల డ్రెడ్జింగ్‌ నిర్వహించారు. మొగ వద్ద 600 మీటర్లు వదిలి మురుగునీటి కాలువలో సుమారు 2.50 కిలో మీటర్ల మేర డ్రెడ్జింగ్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే అర కిలోమీటరు మేర కన్నా ఎక్కువగా ఉన్న మొగ ఇప్పుడు తెరుచుకోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది అధికార పార్టీ మద్దతుదారులు ఇక్కడ ఇసుక తవ్వకాలు చేయడం వల్ల మొగ తెరుచుకుందని రైతులు చెబుతున్నారు.

ఇటీవల మురుగునీటి కాలువలలో డ్రెడ్జింగ్‌ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, దీని వల్ల లాభం కన్నా.. నష్టమే ఎక్కువని రైతులు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. పైగా వర్షాలు లేని సమయంలో వేసవిలో డ్రెడ్జింగ్‌ చేయడం వల్ల ఫలితం లేదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ డ్రెడ్జింగ్‌ కోసం గత ఏడాది ఆగస్టులో డ్రెడ్జర్‌ను రప్పించారు. తవ్వకాలకు అనుమతి రాకపోవడంతో నెలల తరబడి ఇక్కడే ఉంచారు. అప్పట్లో తవ్వకాలు చేసినా గత ఏడాది ఖరీఫ్‌ పంట మునిగి పోకుండా ఉండేది. అప్పుడు చేయకపోవడం వల్ల వర్షాలకు చేలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. పైగా ముంపునీరు వీడకపోవడం వల్ల రబీ నారుమడులు వేసే అవకాశం లేకపోవడం.. సాగు ఆలస్యం కావడం.. ఆ ప్రభావం ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలకు పంట దెబ్బతిని దిగుబడి తగ్గడానికి కారణమైంది. ఇప్పుడు అవసరం లేని సమయంలో డ్రెడ్జింగ్‌ చేయడం వల్ల ఎగదున్నుకు వస్తున్న సముద్ర నీరు కూనవరం కాలువ ద్వారా వేగంగా ఇతర డ్రెయిన్లలోకి వెళ్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

మొగ నుంచి ఎగదన్నుతున్న

సముద్రపు నీటి పోటు

డ్రెయిన్లలోకి ఉప్పునీరు

పంట కాలువలు, చానళ్లకూ చేరిక

ఇదే కొనసాగితే ఖరీఫ్‌కు ముప్పు

ఏటా మూడు వేల నుంచి ఐదు వేల

ఎకరాలు సాగుకు దూరం

డ్రెడ్జింగ్‌ వల్ల నష్టమేనంటున్న రైతులు

సీన్‌ రివర్స్‌

కూనవరం మొగ ద్వారా గత రెండు రోజులుగా సముద్ర నీరు మురుగునీటి కాలువ ద్వారా ఎగదన్నుతోంది. అధికారులు చేసిన డ్రెడ్జింగ్‌ లక్ష్యానికి ఇది పూర్తి విరుద్ధం. ప్రస్తుతం మురుగునీటి కాలువలోకి వస్తున్న నీటికి అడ్డుకట్ట వేయకుంటే ఇది పంట కాలువలు, పంట కాలువలకు అనుబంధంగా ఉండే ఛానళ్లు, పంట బోదెలలోకి కూడా వచ్చే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. ఇదే జరిగితే ఇక్కడ మొత్తం ఆయకట్టును సాగు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. వేసవిలో అమలాపురం–చల్లపల్లి ప్రధాన పంట కాలువ ద్వారా చింతలపూడి లాకు (సమనస లాకు)ల వరకు ఉప్పునీరు వచ్చి చేరుతోంది. ఇప్పుడు కూడా ఇదే జరిగితే కూనవరం డ్రెయిన్‌ పరిధిలో మొత్తం సాగు లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది కాలువల మరమ్మతులు, వంతెనల నిర్మాణాల పేరుతో కాలువలకు గట్లు వేయడం వల్ల చేలకు ఇంకా సాగునీరు చేరలేదు. సాగు కాలం ఆలస్యమవుతున్నందున చాలా మంది రైతులు సాగు విరమణ ఆలోచనలలో ఉన్నారు. ఇప్పుడు మురుగునీరు దిగకపోవడానికి తోడు ఉప్పునీరు చొచ్చుకు వస్తుండడం చూసి సాగు చేసే ఆలోచనలో ఉన్న కొద్దిమంది రైతులూ భయపడుతున్నారు.

వరి, కొబ్బరి రైతులకు అపార నష్టం

ఇప్పటివరకు ముంపు సమస్యతో తొలకరి సాగు చేయడానికి మాత్రమే ఇబ్బంది పడే వాళ్లం. కూనవరం మేజర్‌ డ్రైన్‌ మొగను అధికారుల ప్రమేయం లేకుండా తెరవడంతో సముద్రం నుంచి ఉప్పునీరు డ్రైన్లలోకి చేరుతుంది. దీనితో కూనవరం మేజర్‌ డ్రైవింగ్‌ గుండా నీరు ప్రవహించి పిల్ల కాలువలు పంట కాలువల్లో సైతం ఉప్పునీరు చేరి పంట పొలాల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో దాళ్వా సాగుకు సైతం ఉపయోగపడకుండా భూములు ఉప్పుగా మారి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపించి రైతుల సాగుకు సహకరించాలి.

– మంచం బాలకృష్ణ, రైతు గొల్లవిల్లి, ఉప్పలగుప్తం మండలం

కూనవరమే శాపం! 1
1/2

కూనవరమే శాపం!

కూనవరమే శాపం! 2
2/2

కూనవరమే శాపం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement