
సబ్ ప్లాన్ నిధులు ఏంచేస్తున్నారు
మలికిపురం: కూటమి ప్రభుత్వం దళితులను పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ను శాలువాతో సన్మానించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే 30 శాతం సబ్ప్లాన్ నిధులను దళితుల ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఏం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితుల ఓట్లు తమకు అక్కర్లేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రూ.26 వేల కోట్ల సబ్ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. అంతేకాక దళితులు, దళిత నాయకులుతో పాటు రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పలు నేరాలకు పాల్పడిన వ్యక్తులకు కూటమి ప్రభుత్వం నజరానాలు ఇస్తోందని. విజయనగరంలో రాముని విగ్రహం తల విరగ్గొట్టిన వ్యక్తికి ప్రభుత్వం సాయం చేయడం ఇందుకు ఉదాహరణ అన్నారు. ఏడాది వ్యవధిలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని గొల్లపల్లి పేర్కొన్నారు. పార్టీ నాయకులు పాటి శివకుమార్, కుసుమ చంద్రశేఖర్, తాడి సహదేవ్, నేత నాని, గుర్రం వెంకట నాగరాజు, బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం
అధికార ప్రతినిధిగా ‘తెన్నేటి’
రాజోలు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధిగా రాజోలుకు చెందిన తెన్నేటి కిశోర్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కిశోర్ నియామకం జరిగింది. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎంతో బలంగా ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జగన్ నాయకత్వంలో రాబోయే కాలంలో పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు. హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తనను రాష్ట్ర ప్రచార విభాగ అధికార ప్రతినిధిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మంత్రి సూర్యారావు