ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భరించలేక భస్మం చేసింది

Wife Poured Petrol on Her Husband in Chimakurthy - Sakshi

గడియ పెట్టి తాళం వేయడంతో మంటల్లో కాలి బూడిదైన భర్త 

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట 

సహనం కోల్పోయి పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య 

సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక కోర్టు నుంచి విడాకులు కూడా తీసుకుని విడిపోయారు. బంధువులు సర్ది చెప్పటంతో మళ్లీ కలిసి కాపురం చేస్తున్నారు. అయినా తీరు మారని భర్త వేధింపులతో భార్య తట్టుకోలేక లీటర్‌ పెట్రోల్‌ తెచ్చి మందు తాగి మత్తులో పడుకున్న భర్తపై పోసింది. అగ్గిపుల్లతో నిప్పంటించి తలుపు గడియ పెట్టి తాళం వేసి పరారైంది. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో చుట్టుపక్కల వారు ఫైర్‌స్టేషన్‌కు, పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సంతనూతలపాడులో జరిగింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడు మండలం గాజులపాలెం గ్రామానికి చెందిన క్రిష్టిపాటి మోహన కృష్ణారెడ్డి (31) సంతనూతలపాడులో మద్ది శ్రీనివాసరావు, జ్యోతి దంపతుల కుమార్తె రుక్మిణిని 2011లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మోహన కృష్ణారెడ్డి అప్పటి నుంచి సంతనూతలపాడులోనే నివాసం ఉంటున్నాడు. ఆ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కారు, లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న కృష్ణారెడ్డి మద్యానికి బానిసై భార్య, కుమారుడిని తరుచూ వేధించేవాడు. అంతే కాకుండా అత్తామామలను కూడా హింసించేవాడు. వేధింపులు తట్టుకోలేక రుక్మిణి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఇంట్లో వారు సర్ది చెప్పడంతో ఓర్చుకున్న రుక్మిణి ఆ తర్వాత రోజుల్లో భర్త ఆగడాలు తట్టుకోలేక 2016లో కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకుంది.

చదవండి: (భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..) 

కృష్ణారెడ్డి సోదరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పెటాకులైన కాపురాన్ని నిలబెట్టింది. అయినా మార్పు లేకుండా రోజూ మద్యం తాగి వచ్చి రుక్మిణిని, కుమారుడిని వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి కూడా భార్య, కుమారుడిని కృష్ణారెడ్డి కొట్టి హింసించాడు. విసిగిపోయిన రుక్మిణి మద్యం తాగి ఇంటికొచ్చి మత్తులో పడుకున్న కృష్ణారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. వెంటనే తలుపు గడియపెట్టి తాళం వేసి పరారైంది. పెట్రోల్‌ పోయడంతో మంటలు వేగంగా వ్యాపించి ఆ మంటల్లో కృష్ణారెడ్డి గుర్తు పట్టలేని విధంగా కాలి బూడిదయ్యాడు. సంతనూతలపాడు ఎస్‌ఐ బి.శ్రీకాంత్‌తో కలిసి సంఘటన జరిగిన ప్రాంతాన్ని ఒంగోలు డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. రుక్మిణి తల్లిదండ్రులతో పాటు స్థానికులను విచారించారు. ఒంగోలులో ఉంటున్న కృష్ణారెడ్డి సోదరి హారిక ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top