సాక్షి, నిజామాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్యలో ఊహించన ట్విస్ట్.. హరిబాబును తానే చంపానని వైష్ణవి సోదరుడు సంతోష్ ఒప్పుకున్నాడు. నా చెల్లిని చంపినవాడిని నేనే చంపేశా. నా చెల్లికి జరిగినట్టు ఏ ఆడబిడ్డకు జరగకూడదని ఈ పని చేశానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు ఓ విడియోని రిలీజ్ చేశాడు.
వీడియోలో సంతోష్ మాట్లాడుతూ.. నేనే పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నాని తెలిపాడు. అనంతరం కోరుట్ల పోలీసుల ఎదుట నిందితుడు సంతోష్ లొంగిపోయాడు. విచారణ నిమిత్తం నిందితున్ని కోరుట్ల పోలీసులు నిజామాబాద్ పోలీసులకు అప్పగించనున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన వైష్ణవి (24), చిథారి హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వైష్ణవి 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానల్ను నడుపుతూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 17న తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. ఆమెను భర్త హరిబాబు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు.
అదనపు కట్నం కోసం హరిబాబు, అతని కుటుంబ సభ్యులు (తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్) వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించారని పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయమై మార్చి 16 రాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరిబాబును అదే రోజు కోరుట్ల శివారులో అదపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే వేధింపులకు సంబంధించి అతని కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేగింది.


