Representative image
అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్గరెట్ రోగ్పై (75) అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఉన్న తన భర్తను 19 గంటల పాటు టాయిలెట్ సీటుపైనే వదిలేసి, అవసరమైన సహాయం అందించలేదు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. 76 ఏళ్ల ఆమె భర్తకు డిమెన్షియా, అల్జీమర్స్, చూపు సరిగ్గా లేకపోవడం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ ఘటన అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఫిర్యాదు ప్రకారం.. ఆ వ్యక్తి ఆగస్టు 20న మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లారు. అక్కడి నుంచి లేవలేకపోయారు. రోగ్ కూడా ఆయనను పైకి లేపలేకపోవడంతో, ఆహారం, నీరు, మందులు ఇవ్వకుండా టాయిలెట్పైనే వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 19 గంటల పాటు ఆయన నొప్పితో మూలుగుతున్నప్పటికీ రోగ్కు ఆయనకు సహాయం అవసరమని తెలుసని, అయినా ఎవరికీ ఫోన్ చేయలేదని ప్రాసిక్యూటర్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు.
మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన స్పీచ్ థెరపిస్ట్ ఆయన స్పందించని స్థితిలో ఉండటాన్ని గుర్తించారు. అనంతరం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా.. గుండె వైఫల్యం, శ్వాసకోశ వైఫల్యం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, రక్తంలో సోడియం స్థాయులు అధికం కావడం, సెప్సిస్, రాబ్డోమయోలిసిస్ వంటి సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఆయన శరీర వెనుక భాగంలో గాయాలు, మానసిక స్థితిలో మార్పు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 10 రోజుల తర్వాత ఆయన ఆసుపత్రిలో మరణించారు. టాయిలెట్పైనే వదిలేయడం వల్ల ఏర్పడిన పరిస్థితి, గాయాలు ఆయన మరణానికి గణనీయంగా దోహదపడ్డాయని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు.
ఆమెపై వృద్ధుడిపై నిర్లక్ష్యానికి సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి. రోగ్ నేరాన్ని అంగీకరించలేదు. ఆమె 75,000 డాలర్ల బెయిల్పై విడుదలయ్యారు. కేసులో తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది.


