కన్న తల్లిపై ఉపాధ్యాయుడి దాడి.. | Government Teacher Beats His Mother In Warangal District | Sakshi
Sakshi News home page

కన్న తల్లిపై ఉపాధ్యాయుడి దాడి..

Aug 11 2020 10:36 AM | Updated on Aug 11 2020 11:35 AM

Government Teacher Beats His Mother In Warangal District - Sakshi

తల్లిపై దాడి చేస్తున్న రవీందర్‌

సాక్షి, పరకాల: చిన్న కుమారుడికి దక్కాల్సిన భూమి వాటాపై ప్రశ్నినందుకు కన్న తల్లినే చితకబాదారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితోపాటు కుటుంబ సభ్యులు. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. దాడిపై పరకాల ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు నల్లెల సుశీల తెలిపింది. ఆమె కథనం ప్రకారం.. సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన నల్లెల సూరయ్యకు ముగ్గురు సంతానం. వారికి 7.28 ఎకరాల భూమి ఉండగా కూతురుకు ఎకరం రాసిచ్చారు. సుశీల పేరుపై ఎకరం ఉంది. మిగిలిన భూమిని ఇద్దరు కుమారులు సమానంగా పంచుకోవాల్సి ఉండగా పెద్ద కుమారుడు నల్లెల రవీందర్‌ ఎక్కువ తీసుకున్నాడు. దీంతో చిన్న కుమారుడైన శ్రీధర్‌ తన వాటాకు రావాల్సిన మిగతా భూమి కోసం అన్నతో పోరాడుతున్నాడు.

ఈ విషయంలో చిన్న కుమారుడికి సుశీల అండగా నిలిచింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న రవీందర్‌ పత్తి చేను వద్ద పనిచేస్తున్న తల్లిపై భార్యతో కలిసి దాడి చేశాడు. ఈ దాడిలో వృద్ధురాలి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న  చిన్న కుమారుడు శ్రీధర్‌ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. కాగా, దాడికి సంబంధించిన వీడియోతో ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలితోపాటు శ్రీధర్‌ తెలిపారు. కొందరు స్థానిక పోలీసు అధికారుల అండతో దాడులకు పాల్పడుతున్నాడని జూలై 28న సీఎం కేసీఆర్‌కు, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement