భూ వివాదం: ఉప్పల్‌ ఎమ్మెల్యేపై కేసు

Case Filed On Uppal MLA Bethi Subhas Reddy - Sakshi

భయభ్రాంతులకు గురిచేశారని హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు 

కాప్రా తహసీల్దార్‌పైనా కేసు 

కాప్రా/జవహర్‌నగర్‌: కాప్రా పరిధిలోని ఓ భూవివాదంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డిపై కేసు నమోదైంది. సీఐ మధుకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా మండల పరిధిలోని 152,153 సర్వే నంబర్లలో గల స్ధలంలో జూలకంటి నాగరాజు అనే వ్యక్తి ఈ ఏడాది మార్చి 16న ఫెన్సింగ్‌ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి అనుచరులతోపాటు కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది రెండు జేసీబీలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు.

అక్కడ ఫెన్సింగ్‌ చేస్తున్నవారిని అడ్డుకుని జేసీబీల సహాయంతో వాటిని పూర్తిగా కూల్చివేశారు. అంతేకాకుండా నాగరాజును భయభ్రాంతులకు గురిచేసి ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఉప్పల్‌ ఎమ్మెల్యే, కాప్రా తహీసీల్దార్‌లపై కేసు నమోదు చేయాలని బాధితుడి తరఫు న్యాయవాది మేకల శ్రీనివాస్‌యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. æకోర్టు ఆదేశాల మేరకు జవహర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: ఎమ్మెల్యే 
కాప్రాలోని భూవ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఈ విషయంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయి స్తానని ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి తెలిపారు. ‘ప్రభుత్వ భూమిని కాపాడాలని మేం చెప్పాం. అందులో తప్పేముంది. మేం ఎలాంటి తప్పు చేయలేదు. వారు ఎవరో కూడా నాకు తెలియదు. ప్రభుత్వభూమిని కాపాడాలని అధికారులు ఆ స్థలం వద్దకు వెళ్తే, వారిపై కొందరు దాడి చేసే అవకాశం ఉందని తెలపడంతో రక్షణ కల్పించాలని డీసీపీని కోరాం. 20 ఏళ్ల నుంచి ప్రజాజీవితంలో ఉన్నా. నేను ఏంటో ప్రజలందరికీ తెలుసు. నాపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలే’అని ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి అన్నారు. 

ఆవి ప్రభుత్వ అధీనంలోనివి.. 
‘సర్వే నంబర్లు 152, 153లలో గల 23 ఎకరాల 13 గుంటల భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. మార్చి 16న ఆ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులు ఆక్రమిస్తుండగా అడ్డుకుని కంచెలను తొలగించాం. ఇంతలో అడ్వొకేట్‌ మేకల శ్రీనివాస్‌యాదవ్, శరత్‌చంద్రారెడ్డి అనే వ్యక్తి తమ అనుచరులతో అక్కడికి చేరు కుని రెవెన్యూ సిబ్బంది విధులను అడ్డుకున్నారు. తహసీల్దార్‌తోపాటు సిబ్బందినీ తీవ్రంగా దూషించారు. బెదిరింపులకు పా ల్పడ్డారు. ఈ మేరకు తాము జవహర్‌నగర్‌ పోలీసులకు మార్చి 18న ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది. దీనికి ప్రతిగా.. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, తహసీల్దార్‌ గౌత మ్‌కుమార్‌ తమను బెదిరిస్తున్నారని ఆవ్యక్తు   లు హైకోర్టును ఆశ్రయించారు ’అని కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌ కుమార్‌ తెలిపారు.
చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా.. ప్రమాదమా?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top