పొలం విక్రయంపై రభస.. తట్టుకోలేక యువకుడు
ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మిట్యాతండాలో ఘటన
బిజినేపల్లి: భూమి విక్రయానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మిట్యాతండాకు చెందిన రమావత్ చంద్రు (26) వృత్తిరీత్యా డ్రైవర్. ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఆటో నడుపుతుండేవాడు. ఈయనకు భార్య లక్ష్మితో పాటు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి తమకున్న రెండెకరాలను అమ్మి తీర్చాలనుకున్నాడు. అయితే వారు అంగీకరించక పోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. సోమవారం ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకటేశ్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు)