ఐరాల: మండంలోని నెల్లిమందపల్లెకు చెందిన శతాధిక వృద్ధురాలు సుందరమ్మ(101) సోమవారం ఉదయం మృతి చెందారు. ఈమె భర్త చెన్నప్ప మాజీ సైనికుడు. 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఇందులో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. వృద్ధాప్యంలోనూ తన పని చేసుకునేవారు. సుందరమ్మ కుమారుడి వద్దనే ఉండేవారు. ఆమె మరణవార్త తెలిసిన గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మద్యం మత్తులో డ్రైవింగ్
చిత్తూరు అర్బన్: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి చిత్తూరు కోర్టు భారీ జరిమానా విధించింది. చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న ఏడుగురు పట్టుబడ్డారు. ట్రాఫిక్ ఇన్న్స్పెక్టర్ జి. నిత్యబాబు బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని సోమవారం చిత్తూరు ప్రథమ స్పెషల్ జ్యుడీషియల్ రెండో తరగతి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కె.పరిమళదేవి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించారు. అందులో ఇద్దరికి జరిమానాతో పాటు కోర్టులో ఒకరోజు సాధారణ శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని ట్రాఫిక్ ఇన్న్స్పెక్టర్ జి.నిత్యబాబు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.;
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
యాదమరి: పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మండల పరిధి 12 కమ్మపల్లి గ్రామంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కానీ ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. సోమవారం స్థానిక పాడి రైతులు పాలను తీసుకుని పాల కేంద్రానికి వెళ్తున్నారు. అదే సమయంలో గ్రామ నడిబొడ్డున వెళ్తున్న విద్యుత్ హై టెన్షన్ లైన్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. అక్కడున్న వారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో విద్యుత్ తీగలు ఎవరి మీదా పడలేదు. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. చేతికందే ఎత్తులో విద్యుత్ తీగలున్నా .. వాటిని మార్చాలని మొరపెట్టుకుంటున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులని నిలదీస్తున్నారు.


