తాజాగా నెల్లిపట్లలో చిరుత కలకలం గతంలో గంకొండ అడవిలోమృతి చెందిన ఓ చిరుత పులి ఆందోళనలో అటవీ సమీప గ్రామస్తులు
పలమనేరు: కౌండిన్య అభయారణ్యంలో ఇప్పుడు చిరుతల సంచారం ఎక్కువైంది. అటవీ ప్రాంత గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కౌండిన్య అడవికి ఆనుకొని ఉన్న నెల్లిపట్ల పంచాయతీ ఓటేరుపాళెం, నల్లగుట్లపల్లిల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. కాగా అక్కడి పొలాల వద్ద నివాసముంటున్న గౌస్బాషాకు చెందిన దూడపై ఇటీవల చిరుత దాడిచేసింది.
వాటి మాటేంటి?
రెండేళ్ల క్రితం గంకొండ అడవిలో చిరుతపులి మృతి చెందింది. దీంతో కౌండిన్యలో చిరుతలున్నట్టు ఇక్కడి ఫారెస్ట్ అధికారులు నిర్థారించుకున్నారు. ఆపై కై గల్ అడవిలోని తోటకనుమ బీట్లో ఓ చిరుతపులి మేకల మందపై పడి అదే గ్రామానికి చెందిన శంకరప్ప మేకను తినేసింది. బంగారుపాళెం అడవుల్లో ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చులోపడి మృతిచెందింది. రెండేళ్ల క్రితం వీకోట మండలంలోని నాయకనేరి వద్ద రోడ్డు దాటుతూ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మరో చిరుత మృతిన చెందింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే రెండు చిరుతలు మృతిచెందగా మరో నాలుగు చిరుతలు కౌండిన్యలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా పదిదాకా హైనా(దుమ్ములగొండి)లున్నట్టు తెలుస్తోంది.
చిరుతుల సంతతి పెరిగినట్టే
కౌండిన్య అభయారణ్యానికి ఆనుకుని పలమనేరు నియోజకవర్గంలోని మండిపేటకోటూరు, చెత్తపెంట, ఊసరపెంట, కాలువపల్లి, తిమ్మయ్యగారిపల్లి, వెంగంవారిపల్లి, తోటకనుమ, కై గల్, గాంధీనగర్ం జగమర్ల గ్రామాలున్నాయి. బంగారుపాళెం మండలం కీరమంద, టేకుమంద తమిళనాడు రాష్ట్రానికి చెందిన సైనగుంట్ల, అరవట్ల, మోర్థనా, గుండ్లపల్లి, జిట్టిపల్లి, ధనకొండపల్లి, జంగాళపల్లిలున్నాయి. ఇక పెద్దపంజాణి, సోమల మండలాల్లోని అడవులు కౌండిన్యకు సమీపంలోనివే. కౌండిన్యకు దక్షిణంగా ఉన్న తమిళనాడు గ్రామం ఎర్తాంగళ్లో నాలుగేళ్ల క్రితం ఓ ఇంటిలోకి చిరుత దూరి ముగ్గురిని గాయపరిచింది. గతంలో కడతట్లపల్లి వద్ద ఓ పశువును చంపేసింది. అదే విధంగా గాంధీనగర్లో మేతకెళ్లిన పాడి ఆవు బలైంది.


