పలమనేరు: ‘మా సమస్యలు అయ్యేలే..పొయ్యేలే’ అంటూ అర్జీదారులు నిట్టూర్చారు. సోమవారం పలమనేరు ఆర్డీవో వద్దకు వచ్చిన అర్జీల్లో 90శాతం రెవెన్యూకి సంబంధించినవే. వీటిల్లో 80 శాతం సర్వే సమస్యలే. ఒకే సర్వే నంబరులోని భూమిని సంబంధిత యజమాని విక్రయించి సబ్ డివిజన్ అయ్యి పట్టాదార్ పాసుపుస్తకం వచ్చినా వాటిని సైతం రికార్డుల్లో ఎక్కించకుండా వదిలేశారు. దీంతో గతంలో పట్టా భూములను అమ్మినవాళ్లే మళ్లీ అదే భూములను అమ్ముకునేలా రెవెన్యూ అధికారులే మార్గం చూపించారు. ఇలాంటి ఘటనలు మొరం రెవెన్యూలోనే భారీగా ఉన్నాయి.
అన్న చెప్పాడా అయితే ఓకే!
బైరెడ్డిపల్లి మండలం, నెల్లిపట్ల దళితవాడకు చెందిన సంపూర్ణమ్మకు గతంలో సర్వే నం.392లో గ్రామకంఠం ఒకటిన్నర సెంట్లు ఇంటి పట్టా ఇచ్చారు. అయితే ఆ స్థలానికి పక్కనున్న వారు తమకు దారి కావాలని బాధితులను ఇబ్బంది పెట్టారు. దీనిపై బాధితులు స్థానిక ఆర్డీవోను ఆశ్రయించగా ఆమె స్వయంగా పరిశీలించి పట్టాదారుకు హక్కు ఉందని తేల్చారు. అయితే దారి అడుగుతున్న వ్యక్తులు కూటమి సానుభూతిపరులు కావడంతో వారు వెళ్లి అక్కడి అధికార పార్టీ నేతను కలిసి జరిగింది చెప్పారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు ఆ మండల తహసీల్దార్ కథ మొత్తం మార్చేసి ఆర్డీవోకు ఓ నివేదిక ఇచ్చేశారు. ఆర్డీవో సైతం బాధితులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి చూస్తే కూటమి నేతల ప్రాభల్యం రెవెన్యూ శాఖపై ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అర్జీదారులు ముందుగా వారి దగ్గరికి వెళ్లాల్సిందే
సాధారణంగా ఆయా మండలాల్లోని అర్జీదారులు సోమవారం గ్రీవెన్స్డేకు వెళ్లడం మాములే. కానీ కూటమి పాలన మొదలయ్యాక ఆయా మండలాల్లోని అధికార పార్టీ నేతల గుప్పిట్లో తహసీల్దార్లు తోలు బొమ్మలుగా మారారు. తహసీల్దార్ ఆఫీసులకుమే అర్జీ వెళ్లినా ఆయా తహసీల్దార్లు అన్నతో మాట్లాడుకో ఎందుకబ్బా అనే మాట వినిపిస్తోంది. కాదంటే వారి సమస్య కొండెక్కడం గ్యారెంటీ. ఇలా చట్టాలను ఖాతరు చేయకుండా కేవలం అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ యంత్రాంగం కీలుబొమ్మలుగా మారినందునే వాదన బలంగా వినిపిస్తోంది.


