అబద్ధాలతో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో అరాచక పాలన

Jun 16 2025 6:01 AM | Updated on Jun 16 2025 6:01 AM

అబద్ధాలతో అరాచక పాలన

అబద్ధాలతో అరాచక పాలన

ఏడాదిగా ప్రజలను వంచిస్తున్న

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

తల్లికి వందనం అంటూ

30లక్షల మందికి మోసం

ఆలయాలు కూల్చేసి మనోభావాలను

దెబ్బతీస్తున్న కూటమి నేతలు

భూమన కరుణాకరరెడ్డి, ఆర్‌కే రోజా

తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో కూటమి ఏడాది పాలనలో మోసాలపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు చావా రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, భరత్‌, తిరుపతి కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ శిరీష, చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్‌, వెంకటేగౌడ్‌, సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని నోటికొచ్చిన అబద్దపు హామీల చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ గుప్పించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పథకాల కంటే రెండింతలు ఇస్తానని చెప్పి, అందరినీ వంచించిన ప్రజాద్రోహి చంద్రబాబు అని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.2.80లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అమ్మ ఒడి పథకం కింద రాష్ట్రంలో ఎంతమంది లబ్దిదారులు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లోకి రూ. 15వేలు చొప్పున జమచేసిన మొనగాడు జగనన్న అని కొనియాడారు. అయితే తల్లికి వందనం అంటూ చంద్రబాబు 30లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా ఎగనామం పెట్టారన్నారు. అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా మహిళలకు రూ. 1,500 చొప్పున అందిస్తామని మోసం చేశారని చెప్పారు. యాభై ఏళ్లు నిండిన ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 4వేలు, నిరుద్యోగులకు రూ. 3వేలు భృతి, అన్నదాతా సుఖీభవ కింద రైతులకు రూ. 20వేల చొప్పు ఇస్తానంటూ చెప్పిన హామీలన్నీ ఏమైయ్యాయి చంద్రబాబు అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో మోసాలు, అభూతకల్పనలతోనే పాలన సాగించారే కానీ, రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నోరు పారేసుకోవడం, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరగబడే రోజులు వచ్చాయి

మాజీ మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలు, అక్రమాలతో లోకేష్‌ రెడ్‌బుక్‌ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలను అందించకుండా వైఎస్సార్‌సీపీ నేతలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొడుతున్నా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు. అలాగే గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబుపై మామిడి రైతులు భగ్గుమంటున్నారని తెలిపారు. రైతు బాంధవుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు రూ. 40 గిట్టుబాటు ధరను కల్పించారని గుర్తుచేశారు.అదే కూటమి ప్రభుత్వంలో రూ.4లు కూడా గిట్టుబాటు ధర పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలు, సంక్షేమాన్ని పవన్‌కల్యాణ్‌ గాలికి వదిలేశారన్నారు. సనాతనధర్మాన్ని పరిరక్షిస్తానంటూ ఊదరగొట్టి, రాష్ట్రంలోని పలు ఆలయాలను కూటమి నేతలు కూల్చివేస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండతో కూటమి నేతలు ఇష్టారాజ్యంగా ఆలయాలను కూలుస్తూ హిందువులు మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అరాచక పాలనపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని హెచ్చరించారు. ప్రభుత్వ అకృత్యాలను ఎండగట్టేలా వైఎస్సార్‌సీపీ పోరాటం ఉంటాయని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement