
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ విద్యాధరి వెల్లడించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు.
నేడు పోలీస్ గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కనున్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.
పేద విద్యార్థినికి
మాజీ మంత్రి చేయూత
– మెడిసిన్ చదివిస్తానంటూ హామీ
నగరి : నీట్ ప్రవేశ పరీక్షలో 95.86 శాతంతో 471 మార్కులు సాధించి సత్తా చాటిన విద్యార్థిని జయశ్రీని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశంసించడంతో పాటు తన ఖర్చులతో మెడిసిన్ చదివిస్తానని హామీ ఇచ్చారు. విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథరెడ్డి కుమార్తె జయశ్రీ తన తల్లిదండ్రులతో కలిసి ఆదివారం నగరిలో రోజాను కలిశారు. ఈ సందర్భంగా రోజా జయశ్రీకి స్వీట్ తినిపించి అభినందించారు. మెడిసిన్ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. కాగా జయశ్రీ రెండేళ్లుగా తిరుపతిలోని చైతన్య జూనియర్ కళాశాలలో చదివినా ఇంటర్ చదువుకు సైతం మాజీ మంత్రి రోజానే ఖర్చులు భరించడం విశేషం. పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని వారి ఉన్నత విద్యకు చేయూతనిస్తున్న మాజీ మంత్రి ఉదారతను పలువురు ప్రశంసిస్తున్నారు.
బదిలీ అయిన టీచర్లు
కొత్త పాఠశాలల్లో చేరాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు పరిధిలో బదిలీ అయిన ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్, పీటీలు, ఉద్యోగోన్నతులు పొందిన టీచర్లు కొత్త పాఠశాలల్లో చేరాలని డీఈఓ వరలక్ష్మి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా బదిలీ, ఉద్యోగోన్నతుల ప్రక్రియ ఆదివారంతో ముగిసిందన్నారు. బదిలీలు పొందిన టీచర్లు వెంటనే పాత స్థానాల్లో రిలీవ్ అయ్యి కొత్త స్థానాల్లో చేరాలని డీఈఓ ఆదేశించారు.