
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ కూలీ మృతి
– మరొకరి పరిస్థితి విషమం
పుంగనూరు: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వచ్చిన ఇద్దరు కూలీలు అందులో చిక్కుకుని , ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి సుబ్బరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న యుగంధర్ నాయుడు తన ఇంటి సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు మదనపల్లెలోని సంతపేటకు చెందిన హేమంత్ , రాయలపాడుకు చెందిన రవి అనే కూలీలను పిలిపించాడు. ఆ ఇద్దరు కూలీలు మధ్యాహ్నం ట్యాంకులోనికి దిగి క్లీన్ చేసే సమయంలో విష వాయువులు ఒక్కసారిగా రావడంతో ఊపిరాడక ట్యాంకులో చిక్కుకున్నారు. దీనిపై యజమాని అగ్నిమాపకశాఖ కార్యాలయానికి , 108కు ఫిర్యాదు చేశారు. తక్షణమే రెండుశాఖల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపకశాఖ అధికారి సుబ్బరాజు, సిబ్బంది సెప్టిక్ ట్యాంకులో చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో వెలికితీశారు. వారిలో హేమంత్(27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు రవి (35)ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.