శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 16 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 91,147 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,400 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమలలో చలి తీవ్రత పెరిగిపోయింది. భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూములు దొరక్క ఉన్న భక్తులు వెయిటింగ్ హాళ్ల వద్ద, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద చలికి వణుకుతూ కనిపిస్తున్నారు.


