వెల్త్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లకు ఏఐ దన్ను | Wealthtech sector takes to AI models | Sakshi
Sakshi News home page

వెల్త్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లకు ఏఐ దన్ను

Mar 14 2025 3:52 AM | Updated on Mar 14 2025 8:11 AM

Wealthtech sector takes to AI models

సాధారణ ఇన్వెస్టర్ల నుంచి సంపన్నుల వరకు సేవలు 

లిస్టులో ఇన్వెస్టర్‌ ఏఐ, మైఫై, డిజర్వ్‌ తదితర సంస్థలు 

2023లో 429 బిలియన్‌ డాలర్లుగా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ మార్కెట్‌

వ్యక్తిగత రుణంపై 20 శాతం పైగా భారీ వడ్డీ రేటుతో సతమతమవుతున్న ఓ ఐటీ ప్రొఫెషనల్‌కి కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో సమస్యకు ఓ పరిష్కారం  లభించింది. మ్యూచువల్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోను  ఏఐ ఆధారిత వెల్త్‌టెక్‌ ప్లాట్‌ఫాంకు అనుసంధానించడం ద్వారా తన దగ్గరున్న ఫండ్స్‌పై అత్యంత చౌకగా 10.5 శాతానికే రుణాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. 

ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఏఐ టెక్నాలజీతో ఆదా చేసుకునే మార్గాలను కూడా అందిపుచ్చుకున్నారు. ఇక ఏళ్ల తరబడి మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న మరో ఇన్వెస్టరుకు.. సదరు ఫండ్‌ పనితీరు అంత గొప్పగా లేదనిపించింది. దీంతో ఓ వెల్త్‌టెక్‌ ప్లాట్‌ఫాం మానిటరింగ్‌ సాధనాలను ఉపయోగించుకుని మరింత మెరుగైన రాబడినిచ్చే ఫండ్‌కి మారగలిగారు. మంచి ప్రయోజనం పొందారు.

ఇలా సాధారణంగా సంస్థాగత ఇన్వెస్టర్లకే లభ్యమయ్యే పెట్టుబడుల పరిజ్ఞానాన్ని సామాన్య మదుపరులు కూడా అందుకోవడంలో వెల్త్‌టెక్‌ స్టార్టప్‌లు దన్నుగా నిలుస్తున్నాయి. అధునాతనమైన కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), జనరేటివ్‌ ఏఐ (జెన్‌ఏఐ) సాంకేతికతల వినియోగంతో ఈ అంకురాలు దూసుకెళ్తుండటంతో దేశీయంగా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వివిధ రకాల మదుపరులకు సంపద నిర్వహణ విషయంలో మరింత వ్యక్తిగత స్థాయిలో సలహాలు ఇస్తున్నాయి. 

ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోను, రిసు్కలను అధిగమించడంలోను తోడ్పాటునిస్తున్నాయి. టెక్‌సై రీసెర్చ్‌ నివేదిక ప్రకారం దేశీయంగా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవల మార్కెట్‌ 2023లో 429.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది 2025 నుంచి 2029 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 4.56 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఈ ఏడాదే ఏఐ అప్లికేషన్స్‌ తోడ్పాటుతో ఈ రంగం 1–2 బిలియన్‌ డాలర్ల మేర పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో సంపన్నులు, టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.  

వందకు పైగా అంకురాలు..
అధ్యయన సంస్థ ట్రాక్షన్‌ ప్రకారం ప్రస్తుతం దాదాపు 122 అంకురాలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి.  ఇన్వెస్టర్‌ఏఐ అనే సంస్థ నేరుగా బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫాంలతో అనుసంధానమై సరీ్వసులు అందిస్తోంది. చాట్‌జీపీటీ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బ్రూస్‌ కీత్‌ వెల్లడించారు. దీనితో ట్రేడింగ్‌లో 70% వరకు విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయన్నారు. మైఫై అనే మరో స్టార్టప్‌ సంస్థ, మార్కెట్‌ ధోరణులను విశ్లేషించి, తగిన పెట్టుబడి వ్యూహాలను సూచించేందుకు ఏఐ, జెన్‌ఏఐ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. ఆటోమేటెడ్‌ అసిస్టెంట్లు, రియ ల్‌ టైమ్‌ విశ్లేషణలతో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే కచి్చతమైన ఫలితాలనిచ్చే సలహాలను అందిస్తోంది.

పెట్టుబడుల జోరు.. 
వెల్త్‌టెక్‌ స్టార్టప్‌లకున్న సామర్థ్యాలను గుర్తించి, వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్‌ క్యాపిటలిస్టులు ముందుకొస్తున్నారు. డిజర్వ్‌ అనే సంస్థలో 2024 జూలైలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సారథ్యంలో ఇన్వెస్టర్లు 32 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది పోర్ట్‌ఫోలియోను సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు లక్షల కొద్దీ డేటా పాయింట్లను విశ్లేషించి, తగు సలహాలిస్తుంది. ఇక గురుగ్రామ్‌కి చెందిన సెంట్రిసిటీ అనే మరో స్టార్టప్‌ .. 20 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. ఇది అత్యంత సంపన్నులు, స్వతంత్ర ఫైనాన్షియల్‌ ప్రోడక్ట్‌ డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక సలహాలు అందిస్తోంది. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement