ఫలితాలు, భౌగోళిక పరిణామాలదే కీలక పాత్ర | US elections impact Indian stock markets | Sakshi
Sakshi News home page

ఫలితాలు, భౌగోళిక పరిణామాలదే కీలక పాత్ర

Jul 27 2020 6:17 AM | Updated on Jul 27 2020 6:17 AM

US elections impact Indian stock markets - Sakshi

న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయ ఈక్విటీ మార్కెట్లను ఈ వారంలో కంపెనీల జూన్‌ త్రైమాసిక ఫలితాల ధోరణి, భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు గత వారం అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు.. వీటికితోడు దేశీయంగా కరోనా వైరస్‌ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కనిష్టాల నుంచి గణనీయంగా ర్యాలీ చేసిన నేపథ్యంలో స్థిరీకరణ చెందొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ వారంలో కోటక్‌ మహీంద్రా బ్యాంకు, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తదితర ముఖ్యమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. ఆయా అంశాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయి. గత వారం సెన్సెక్స్‌ నికరంగా 1,109 పాయింట్లు, నిఫ్టీ 292 పాయింట్లు లాభపడడం గమనార్హం.

ఇన్ఫోసిస్‌లో శిభూలాల్‌ వాటాల విక్రయం
ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్‌డీ శిభూలాల్‌ కుటుంబ సభ్యులు కంపెనీలో 85 లక్షల షేర్లను ఈ నెల 22–24 తేదీల మధ్య విక్రయించినట్టు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల డేటా తెలియజేస్తోంది. వీటి విలువ రూ.777 కోట్లు. దాతృత్వ కార్యక్రమాలు, పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement