అద‌రగొట్టేస్తున్న టీవీఎస్ కొత్త బైక్ ,ధ‌ర ఎంతంటే!

TVS Ronin 225 India Launch Highlights - Sakshi

పంజిమ్‌ (గోవా): ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్‌ మోటర్‌ బుధవారం ప్రీమియం లైఫ్‌స్టయిల్‌ 225 సీసీ బైక్‌ ’రోనిన్‌’ను ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో లభించే ఈ బైక్‌ ధర రూ. 1.49 లక్షలు, రూ. 1.56 లక్షలు, రూ. 1.69 లక్షలుగా (ఎక్స్‌–షోరూమ్‌) ఉంటుంది.

డ్యుయల్‌ చానల్‌ ఏబీఎస్, వాయిస్‌ అసిస్టెన్స్, అలాయ్‌ వీల్స్, ఎల్‌ఈడీ ల్యాంప్స్‌ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఎంపిక చేసిన డీలర్ల దగ్గర ఈ నెల నుంచి రోనిన్‌ అందుబాటులో ఉంటుందని టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ ఎండీ సుదర్శన్‌ వేణు తెలిపారు. రోనిన్‌ ఆవిష్కరణ తమ సంస్థకు ఒక మైలురాయిలాంటిదని ఆయన పేర్కొన్నారు.  

గడ్డుకాలం గట్టెక్కినట్లే.. 
దేశీ టూ–వీలర్‌ పరిశ్రమకు గడ్డు కాలం తొలగిపోయినట్లేనని, రాబోయే రోజుల్లో రెండంకెల స్థాయికి తిరిగి రాగలదని అంచనా వేస్తున్నట్లు వేణు వివరించారు. చిప్‌ల లభ్యత క్రమంగా మెరుగుపడుతోందని వేణు  చెప్పారు.

మెరుగైన వర్షపాతాల అంచనాలతో ఈ ఆర్థిక సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకోగలవని భావిస్తున్నట్లు టీవీఎస్‌ డైరెక్టర్‌ కేఎన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. కమోడిటీల ధరలు కొంత మేర సవాళ్లు విసిరే అవకాశం ఉందని చెప్పారు. ప్రీమియం బైక్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటున్న ఆసియా, లాటిన్‌ అమెరికా తదితర ప్రాంతాలకు కూడా రోనిన్‌ బైక్‌ను ఎగుమతి చేయనున్నట్లు రాధాకృష్ణన్‌ వివరించారు. ప్రస్తుతం మోటర్‌సైకిల్‌ స్పోర్ట్స్‌ సెగ్మెంట్‌ (150 సీసీ పైబడి) నెలకు దాదాపు 1.5 లక్షల యూనిట్లుగా ఉంటోందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని సంస్థ ప్రీమి యం బిజినెస్‌ హెడ్‌  విమల్‌ సంబ్లీ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top