బస్సులకు డిజిటల్‌ పాస్‌లు.. యాప్‌లో బుకింగ్ | TGRTC Digital Pass Mee Ticket Coming Soon in Telangana | Sakshi
Sakshi News home page

బస్సులకు డిజిటల్‌ పాస్‌లు.. యాప్‌లో బుకింగ్

Oct 6 2025 5:24 PM | Updated on Oct 6 2025 6:07 PM

TGRTC Digital Pass Mee Ticket Coming Soon in Telangana

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం నిర్వహిస్తున్న ‘మీటికెట్’ యాప్ ద్వారా త్వరలో టీజీఆర్‌టీసీ ఇంటర్‌సిటీ బస్సు సేవలు & క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

స్టేట్ స్మార్ట్ మొబిలిటీ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ విస్తరణతో ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ఇక నుంచి బస్సు టికెట్లు, నెలవారీ పాస్‌లు మొబైల్‌లోనే పొందవచ్చు. 2025 జనవరి 9న ప్రారంభమైన మీటికెట్ యాప్ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకు 1.35 లక్షల డౌన్‌లోడ్లు, 2.6 లక్షల టికెట్ బుకింగ్స్, రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. యాప్ రేటింగ్ 3.5కు పైగా ఉండగా, ప్రస్తుతం 221 ప్రదేశాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో, 123 పార్కులు, 16 దేవాలయాలు, ఆరు మ్యూజియాలు, ఖుత్బ్ షాహీ సమాధులు వంటి ప్రదేశాలు ఈ సేవల్లో ఉన్నాయి.

టీజీఆర్‌టీసీ సేవలు చేర్చడంతో ఇకపై సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఎసీ), పుష్పక్ ఎసీ బస్సులకు కూడా డిజిటల్‌గా టికెట్లు, పాస్‌లు పొందవచ్చు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు వంటి ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా చెల్లింపు చేసుకోవచ్చు. దీంతో క్యూ‌లలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం మీటికెట్ పరిధిలో 98 అటవీ ప్రదేశాలు, 52 పర్యాటక బోటింగ్ సెంటర్లు, 16 దేవాదాయ శాఖ దేవాలయాలు, 9 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, గాంధీ సెంటెనరీ మ్యూజియం వంటి ప్రదేశాలను కూడా ఈ యాప్‌లో చేర్చారు. పర్యాటకులు, స్థానికులకు ఇది సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు. టీజీఆర్‌టీసీ సేవల అధికారిక ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు ఈఎస్‌డీ విభాగం వెల్లడించింది. ఇది రాష్ట్రంలో పౌర సౌకర్యాలను పెంచుతూ, డిజిటల్ గవర్నెన్స్ వైపు తెలంగాణ మరో ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement