గత రెండేళ్లలో రూ.84,000 కోట్లకు పైగా పెట్టుబడుల మద్దతుతో, తెలంగాణ జీవ శాస్త్రాల పర్యావరణ వ్యవస్థ సుమారు 145 బిలియన్ డాలర్ల విలువను చేరుకోవడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వేగవంతమైన విస్తరణగా నిలిచింది.
పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ (టిఎల్ఎస్ఎఫ్) 7వ బోర్డు సమావేశంలో ఈ పరివర్తనాత్మక పురోగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. టిఎల్ఎస్ఎఫ్ సీఈఓ శక్తి ఎం. నాగప్పన్, తన దశాబ్ద కాల పదవీకాలంలో ఈ రంగం సాధించిన వృద్ధిపై సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి మరియు గౌరవనీయ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబుల శక్తివంతమైన నాయకత్వంలో గడిచిన రెండేళ్లు ఒక కీలక మలుపు అని ఆయన నొక్కి చెప్పారు.
తెలంగాణాలో 2016 నుంచి జీవశాస్త్ర రంగం దాదాపు మూడు రెట్లు అభివృద్ధి చెందింది. దీనితో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ అండ్ హెల్త్ టెక్ ఆవిష్కరణలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది.
ఒక విశేషమైన ఘనత ఏమిటంటే, ప్రపంచంలోని అగ్రగామి పది లైఫ్ సైన్సెస్ కంపెనీలలో తొమ్మిదింటికి చెందిన సాంకేతిక, ఆవిష్కరణ కేంద్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఘనత సాధించిన, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం ఇదే. పటిష్టమైన విధాన కార్యాచరణ విధానాలు, వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాలు మరియు లక్షిత సంస్థాగత నిర్మాణం వంటివి దీనికి కీలక చోదకాలుగా ఉన్నాయి. ఇవి తెలంగాణను సమగ్రమైన ప్రపంచ పర్యావరణ వ్యవస్థగా సుస్థిరం చేస్తున్నాయి.
ఈ పరివర్తన దశలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్ది, విస్తరించడంలో చూపిన నాయకత్వానికి బోర్డు ఏకగ్రీవంగా సీఈఓ శక్తి ఎం. నాగప్పన్ను ప్రశంసించింది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభినందనలను నమోదు చేసింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనను 'సలహాదారు (లైఫ్సైన్సెస్)'గా నియమించిందని, అలాగే ఆయన తెలంగాణ లైఫ్సైన్సెస్ ఫౌండేషన్ బోర్డులో కొనసాగుతారని బోర్డు పేర్కొంది.


