సాంకేతికతతో యుద్ధానికి సై | Technologies Used in Modern Warfare | Sakshi
Sakshi News home page

సాంకేతికతతో యుద్ధానికి సై

May 6 2025 12:00 PM | Updated on May 6 2025 12:44 PM

Technologies Used in Modern Warfare

సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. అందుకు యుద్ధ భూమి ఏమీ అతీతం కాదు. శత్రువులపై యుద్ధం సాధించేందుకు, స్పష్టమైన ఫలితాల కోసం టెక్నాలజీ వాడుతున్నారు. ఇందులో భాగంగా మానవరహిత ఆయుధాలు, సైబర్‌ వార్ఫేర్‌, డ్రోన్లు, రోబోటిక్స్‌, అన్‌ మ్యాన్డ్‌ అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌.. వంటి చాలా పరికరాల్లో సాంకేతికతను వినియోగిస్తున్నారు. కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న  ఈ రోజుల్లో రణరంగంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం.

ఏఐ, మెషిన్ లెర్నింగ్

యుద్ధ సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, ఇంటెలిజెన్స్ విశ్లేషణను మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు. యుద్ధరంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తోంది. శత్రువుల కదలికలను అంచనా వేయడానికి లేదా వ్యూహాత్మక లక్ష్యాలను గుర్తించడానికి ఏఐ విస్తారమైన డేటాసెట్లను ప్రాసెస్ చేస్తుంది. అటానమస్‌ విధానం ద్వారా డ్రోన్లు, వాహనాలకు ఏఐ సామర్థ్యాలు జోడిస్తున్నారు. ఇది మానవ ప్రమేయం లేకుండా రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్‌కు వీలు కల్పిస్తుంది. సైబర్ బెదిరింపులను గుర్తించి సమర్థంగా కట్టడి చేసేందుకు మెషిన్ లెర్నింగ్ తోడ్పడుతుంది. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షిస్తుంది.

మానవ రహిత వ్యవస్థలు (డ్రోన్లు, రోబోటిక్స్)

యుద్ధంలో మానవరహిత వ్యవస్థలు అనివార్యంగా పెరుగుతున్నాయి. ఇది సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని తగ్గిస్తుంది. ఇందులో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. ఏరియల్ డ్రోన్లను నిఘా, దాడుల్లో కచ్చితత్వం కోసం ఉపయోగిస్తున్నారు. అమెరికా ఆర్మీకి చెందిన స్మాల్ అన్‌మ్యాన్డ్‌ గ్రౌండ్ వెహికల్ (ఎస్‌యూజీవీ) వంటి రోబోలు బాంబుల తొలగింపును నిర్వహిస్తున్నాయి. మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ (యూయూవీ) మైన్ డిటెక్షన్, సబ్ మెరైన్ ట్రాకింగ్ పనులు చేస్తున్నాయి.

సైబర్ వార్‌ఫేర్‌ టెక్నాలజీ

యుద్ధ సమయంలో కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థలు, ఇతర రక్షణ వ్యవస్థలకు అంతరాయం కలిగించేలా సైబర్‌ దాడులు నిర్వహించే అవకాశం ఉంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబర్ వార్‌పేర్‌ డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఇందులో భాగంగా మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్ ద్వారా ప్రభుత్వ ప్రాయోజిత వెబ్‌సైట్‌ల్లోని సమాచారం శత్రు దేశాల్లోని నెట్‌వర్క్‌లోకి వెళ్లకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ ద్వారా మిలిటరీ నెట్‌వర్క్‌లను రక్షిస్తున్నారు.

అధునాతన ఆయుధాలు

ఆధునిక ఆయుధాల ద్వారా ప్రమాద పరిధి పెరుగుతుంది. రష్యాకు చెందిన కింజాల్ అనే హైపర్ సోనిక్ ఆయుధాలు లేదా చైనాకు చెందిన డీఎఫ్-జెడ్ ఎఫ్ వంటి క్షిపణులు సంప్రదాయ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే తప్పించుకుంటాయి. లేజర్లు, మైక్రోవేవ్ వ్యవస్థలు డ్రోన్లు లేదా క్షిపణులను కచ్చితత్వంతో నిలిపివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జీపీఎస్ గైడెడ్ బాంబులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేదిస్తాయి.

ఇదీ చదవండి: భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో టాప్‌ బ్రాండ్‌ ఇదే..

శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీస్

సైనిక కార్యకలాపాలకు అంతరిక్షం కీలకమైన డొమైన్‌గా మారింది. నిఘా ఉపగ్రహాలతో రియల్ టైమ్ ఇమేజ్‌లు, ప్రత్యేకంగా సిగ్నలింగ్‌ సదుపాయాలను పొందుతున్నారు. దళాల కదలికల కోసం జీపీఎస్, నావిగేషన్‌ను వాడుతున్నారు. కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించే శత్రు ఉపగ్రహాలను నిలిపివేయడానికి లేదా నాశనం చేయడానికి యాంటీ శాటిలైట్ వెపన్స్ రూపొందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement