ServiceNow study: ఏఐ నైపుణ్యాల పెంపు అత్యావశ్యకం | Sakshi
Sakshi News home page

ServiceNow study: ఏఐ నైపుణ్యాల పెంపు అత్యావశ్యకం

Published Thu, Nov 2 2023 4:50 AM

ServiceNow study: AI, automation will need 16. 2 million Indian workers to upskill, reskill - Sakshi

న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌/ఏఐ), ఆటోమేషన్‌పై దేశంలో 1.62 కోట్ల మందికి నైపుణ్యాల పెంపు, పునఃశిక్షణ అవసరం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ రెండు విభాగాల్లో 47 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు రానున్నట్టు తెలిసింది. సర్వీస్‌నౌ సంస్థ అధ్యయనం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. ఉపాధి ముఖచిత్రాన్ని ఏఐ మార్చేయనుందని, డిజిటల్‌నైపుణ్యాల పెంపుతోపాటు టెక్నాలజీలో లక్షలాది ఉపాధి అవకాశాలను తీసుకురానుందని ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది.

అప్లికేషన్‌ డెవలపర్లు అదనంగా 75,000 మంది అవసరమని పేర్కొంది. డేటా అనలిస్టులు 70,000 మంది, ప్లాట్‌ఫామ్‌ ఓనర్లు 65,000 మంది, ప్రొడక్ట్‌ ఓనర్లు 65,000 మంది, ఇంప్లిమెంటేషన్‌ ఇంజనీర్లు 55,000 మంది 2027 నాటికి అవసరం ఉంటుందని వెల్లడించింది. టెక్నాలజీ కారణంగా తయారీలో ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయని, 23 శాతం మంది ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోవాల్సి వస్తుందని పేర్కొంది.

ఆ తర్వాత వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్‌లో 22 శాతం, హోల్‌సేల్, రిటైల్‌ వాణిజ్యంలో 11.6 శాతం, రవాణా, స్టోరేజ్‌లో 8 శాతం, నిర్మాణ రంగంలో 7.8 శాతం మంది కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని వివరించింది. సర్వీస్‌నౌ సంస్థ నైపుణ్యాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తుంటుంది. ఇప్పటికే 13కు పైగా విద్యా సంబంధిత భాగస్వామ్యాలను కుదుర్చుకుంది.

కీలకమైన వ్యాపార అవసరాలు, భవిష్యత్‌ అవసరాలకు ఉద్యోగులను సిద్ధం చేసేందుకు వీలుగా నాస్కామ్‌కు చెందిన ఫ్యూచర్‌ స్కిల్స్‌ ప్రైమ్‌తో ఆగస్ట్‌లో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ‘‘దేశవ్యాప్తంగా ప్రతి పరిశ్రమతో పనిచేస్తున్నాం. ఏఐని అర్థవంతమైన వ్యాపార మార్పుల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చన్నది తెలియజేస్తున్నాం. ఈ మార్పుల వల్ల ఉత్పాదకత పెంపుతోపాటు నాణ్యమైన, సురక్షితమైన ఉపాధి అవకాశాలను అందించేలా చూస్తున్నాం’’అని సెక్యూర్‌నౌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమోలికా గుప్తా పెరెస్‌ వివరించారు.   

రికార్డు స్థాయిలో కొత్త ఉద్యోగాలు: అప్నా
పండుగలకు ముందు పెద్ద ఎత్తు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్ట్, సెపె్టంబర్‌లో కొత్తగా 1.2 లక్షల ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ వివరాలను జాబ్స్, ప్రొపెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఆప్నా డాట్‌ కో విడుదల చేసింది. జూలై–సెపె్టంబర్‌ కాలంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యరి్థనుల సంఖ్య 61 శాతం పెరిగింది. ఇది మహిళా నిపుణుల కోసం వివిధ రంగాల్లో పెరిగిన డిమాండ్‌ను సూచిస్తున్నట్టు అప్నా నివేదిక తెలిపింది.

ఈ కామర్స్, రిటైల్, ఆతిథ్య రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కలి్పంచినట్టు వెల్లడించింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో బజాజ్, యాక్సిస్‌ బ్యాంక్, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌ కంపెనీలు ఎక్కువ నియామకాలకు ముందుకు వచి్చనట్టు తెలిపింది. మంచి ప్రతిభ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఆఫర్‌ చేయడంతోపాటు, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగుల భర్తీకి ప్రాధాన్యం ఇచి్చనట్టు పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెపె్టంబర్‌ వరకు తన ప్లాట్‌ఫామ్‌లో యాజమాన్యాల సంప్రదింపులు పెరిగాయని, 78,000 కొత్త సంస్థలు చేరినట్టు వెల్లడించింది. 2022 ఇదే కాలంలో 42,000 కొత్త సంస్థల చేరికతో పోల్చి చూస్తే గణనీయమైన వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,70,000 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల అయితే, అవి ఈ ఏడాది 2,13,000కు పెరిగినట్టు తెలిపింది. మహిళా దరఖాస్తు దారుల సంఖ్య పెరిగిందని, గతేడాదితో పోలిస్తే ఉద్యోగార్థుల ప్రాధాన్యతల్లోనూ మార్పు కనిపించినట్టు అప్నా సీఈవో నిర్మిత్‌ పారిఖ్‌ తెలిపారు.

Advertisement
Advertisement