రూట్‌ మొబైల్‌ లిస్టింగ్‌.. అదుర్స్‌

Route mobile big bang listing  - Sakshi

రూ. 358 లాభంతో రూ. 708 వద్ద లిస్టింగ్

ఇష్యూ ధర రూ. 350- రూ. 600 కోట్ల సమీకరణ

ఐపీవోకు 73 రెట్లు అధికంగా బిడ్స్‌

యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్ల పెట్టుబడుల

ఓమ్నిచానల్‌ క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసుల సంస్థ రూట్‌ మొబైల్‌.. బిగ్‌బ్యాంగ్‌ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 350 కాగా.. బీఎస్‌ఈలో ఏకంగా రూ. 708 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది 102 శాతం(రూ. 358) లాభంకాగా.. ప్రస్తుతం రూ. 641 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 735 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 626 వద్ద కనిష్టానికీ చేరింది. ఈ నెల 11న ముగిసిన రూట్‌ మొబైల్‌ ఇష్యూ 73 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. గత వారం లిస్టయిన ఐటీ సేవల కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్‌ మరింత అధికంగా 111 శాతం ప్రీమియంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన విషయం విదితమే.

యాంకర్‌ నిధులు
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూట్‌ మొబైల్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 350 ధరలో 15 సంస్థలకు దాదాపు 51.43 లక్షల షేర్లను జారీ చేసింది. ఐపీవోలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలలో ఎస్‌బీఐ ఎంఎఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ తదితరాలున్నాయి. ఐపీవో ద్వారా రూట్‌ మొబైల్‌ మొత్తం రూ. 600 కోట్లను సమీకరించింది. నిధులను రుణ చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.

కంపెనీ వివరాలు
రూట్‌ మొబైల్‌ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్‌ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్‌ప్రైజెస్‌, మొబైల్‌ ఆపరేటర్, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్‌ టు పీర్‌(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్‌, ఓటీటీ బిజినెస్‌ మెసేజింగ్‌, వాయిస్‌, ఓమ్ని చానల్‌ కమ్యూనికేషన్‌ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్‌, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటికే లిస్టయిన అఫ్లే ఇండియాతో రూట్‌ మొబైల్‌ కార్యకలాపాలను పోల్చవచ్చని విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top