బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు! | Robert Kiyosaki on market crash, gold and silver price prediction | Sakshi
Sakshi News home page

బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!

May 23 2026 2:33 PM | Updated on May 23 2026 2:58 PM

Robert Kiyosaki on market crash, gold and silver price prediction

ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం (మార్కెట్ క్రాష్) రాబోతోందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దూసుకుపోతాయని కియోసాకి అంచనా వేశారు.

బంగారం, వెండిపై కియోసాకి అంచనాలు ఇవే

ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రిచర్డ్స్ అంచనాలను ప్రస్తావిస్తూ కియోసాకి ఈ వివరాలను పంచుకున్నారు.

బంగారం ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ బంగారం ధర సుమారు 4,500 డాలర్లుగా ఉంటే... అది భవిష్యత్తులో ఏకంగా 1,00,000 (ఒక లక్ష) డాలర్లకు చేరుకుంటుందని జిమ్ రిచర్డ్స్ పేర్కొన్నట్లు కియోసాకి తెలిపారు.

వెండి ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ వెండి ధర సుమారు 75 డాలర్లుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇది 200 డాలర్లను తాకుతుందని తాను భావిస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు.

"సంక్షోభంలోనూ ధనవంతులు కావచ్చు"

భవిష్యత్తును ముందుగానే ఊహించి, దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు (పెట్టుబడులు) తీసుకోగలిగినవారే అత్యుత్తమ ఇన్వెస్టర్లు అవుతారని కియోసాకి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

"రాబోయే ఆర్థిక సంక్షోభానికి మీరు బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సంక్షోభ సమయంలోనూ మీరు మరింత ధనవంతులు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.

సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలోనే కియోసాకి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అంతర్జాతీయ మదుపర్లలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement