కీలక వడ్డీ రేట్లు యథాతథం

RBI policy Status quo - Sakshi

ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు

4 శాతం వద్దే రెపో రేటు

రివర్స్‌ రెపో 3.35 శాతంగా కొనసాగింపు

రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంవద్దే కొనసాగనుంది. ఈ బాటలో రివర్స్‌ రెపో సైతం 3.35 శాతంగా అమలుకానుంది. బ్యాంక్‌ రేటు, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా కొనసాగనుంది. ఆర్థిక వ్యవస్థకు కోవిడ్‌-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఎంపీసీ ఇందుకు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ ఆర్‌బీఐ రెపో రేటులో 1.15 శాతంమేర కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తాజా రుణాలపై దేశీ బ్యాంకులు సైతం 0.72-0.8 శాతం మధ్య వడ్డీ రేట్లను తగ్గించాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top