ఓటీపీ రాలేదా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌ | OTP delays No need to worry TRAI clarifies | Sakshi
Sakshi News home page

ఓటీపీ రాలేదా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌

Nov 29 2024 11:21 AM | Updated on Nov 29 2024 12:29 PM

OTP delays No need to worry TRAI clarifies

నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి సేవల్లో కీలకమైన ఓటీపీ మెసేజ్‌లు అందుకోవడంలో జాప్యంతో టెలికం వినియోగదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు డిసెంబర్ 1 నుండి ఉండవని వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) భరోసా ఇచ్చింది.

డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలతో ముఖ్యమైన ఓటీపీ మెసేజ్‌ల డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని ట్రాయ్‌ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ పరిస్థితి అదుపులోనే ఉందని నొక్కి చెప్పింది. సమస్యలను నివారించడంలో భాగంగా సందేశాలను ట్రాకింగ్ చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించింది.

ఫేక్‌ కాల్స్‌, మెసేజ్‌లకు సంబంధించి పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ట్రాయ్‌ చురుగ్గా పనిచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు అక్టోబర్ 1న కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అవాంఛిత మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే వ్యవస్థను నవంబర్ 30 లోపు టెలికాం  సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి అక్టోబర్ 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ టెలికం కంపెనీలు మరింత సమయం కావాలని అభ్యర్థించడంతో ట్రాయ్‌ మంజూరు చేసింది.

ఇదీ చదవండి: డిసెంబర్‌లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..

బల్క్ మెసేజ్‌లు ఎక్కడ నుండి వస్తున్నాయో ట్రాక్ చేసే వ్యవస్థ ఏర్పాటైతే అనుమానాస్పద లేదా మోసపూరిత సందేశాల మూలాన్ని గుర్తించడం వీలవుతుంది. దీంతోపాటు ముఖ్యమైన ఓటీపీల డెలివరీలో జాప్యం తగ్గుతుందని ట్రాయ్‌ పునరుద్ఘాటించింది.

Advertisement
 
Advertisement
Advertisement