ఓఎన్‌జీసీ ఓఎఫ్‌ఎస్‌కి భారీ స్పందన | ONGC Offer For Sale: Institutional Buyers Portion Oversubscribed, Gets Bids Worth Rs 4,854 Crore | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ ఓఎఫ్‌ఎస్‌కి భారీ స్పందన

Mar 31 2022 5:59 AM | Updated on Mar 31 2022 5:59 AM

ONGC Offer For Sale: Institutional Buyers Portion Oversubscribed, Gets Bids Worth Rs 4,854 Crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా 1.5 శాతం వాటాల విక్రయానికి భారీ స్పందన లభిస్తోంది. బుధవారం తొలి రోజున సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది.  వారికి 8.49 కోట్ల షేర్లను కేటాయించగా 3.57 రెట్లు అధికంగా 30.35 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి ప్రతిపాదించిన రూ. 159 రేటు ప్రకారం వీటి విలువ రూ. 4,854 కోట్లుగా ఉంటుంది.

రెండు రోజుల పాటు కొనసాగే ఓఎఫ్‌ఎస్‌ కింద ఓఎన్‌జీసీలో 1.5 శాతం వాటాల (9.43 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా కేంద్రం సుమారు రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 94.35 లక్షల షేర్లను కేటాయించారు. ఈ విభాగం ఓఎఫ్‌ఎస్‌ గురువారం ప్రారంభమవుతుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌కు నాన్‌–రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే.. ట్వీట్‌ చేశారు.  

షేరు 5 శాతం డౌన్‌..
ఓఎఫ్‌ఎస్‌ కోసం షేరు ధరను మంగళవారం నాటి ముగింపు రేటు రూ. 171.05తో పోలిస్తే 7 శాతం డిస్కౌంటుతో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేరు 5 శాతం క్షీణించి రూ. 162.25 వద్ద ముగిసింది. ఫలితంగా రూ. 11,000 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆవిరైంది.

Advertisement
 
Advertisement
Advertisement