గౌతమ్‌ అదానీపై సంచలన ఆరోపణలు | Gautam Adani Charged In US With Alleged $265 Million Bribery Scheme, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘లంచమిచ్చారు..’ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు

Nov 21 2024 8:07 AM | Updated on Nov 21 2024 10:51 AM

Gautam Adani charged in US with alleged 265 million bribery

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.

20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు.

అదానీ కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పందించారు. కేసు నుంచి అదానీ తప్పించుకోలేరని, వాళ్ల దగ్గర తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి తప్పించుకునేందుకు అక్కడున్నది మోదీ ప్రభుత్వం కాదని చురకలేశారు. దీనిపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ డిమాండ్‌ చేశారు.

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అమెరికా అధికారుల అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ యూనిట్లు 600 మిలియన్ డాలర్ల బాండ్‌ను రద్దు చేశాయి. అలాగే అమెరికన్‌ డాలర్‌పై జారీ చేసిన అన్ని బాండ్లను వెనక్కితీసుకున్నట్లు తెలిసింది.

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం.. అదానీ సంపద 69.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలో 22వ అత్యంత సంపన్నుడిగా ఉన్న ఆయన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు. గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డాక అదానీ గ్రూప్ స్టాక్‌లలో సుమారు 150 బిలియన్‌ డాలర్లు కరిగిపోయాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement