ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్కార్ట్ ప్రస్తుతం తీవ్రమైన సోషల్ మీడియా విమర్శలను ఎదుర్కొంటోంది. కంపెనీకి చెందిన ‘స్టాఫ్ యూనిఫాం అండ్ గ్రూమింగ్ గైడ్’ పేరుతో వైరల్ అవుతున్న ఒక డాక్యుమెంట్ మతపరమైన వివక్షకు తావిచ్చేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హిందూ సంప్రదాయాలైన బిందీ, తిలకంపై నిషేధం విధిస్తూ హిజాబ్కు అనుమతినివ్వడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వివాదం ముదరడంతో సంస్థ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.
వివాదానికి కారణం ఏమిటి?
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం.. లెన్స్కార్ట్ అంతర్గత మార్గదర్శకాల్లో స్టోర్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని వివాదాస్పద నిబంధనలు వెలుగులోకి వచ్చాయి. ముస్లిం మహిళా ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు నలుపు రంగు హిజాబ్, అలాగే సిక్కు ఉద్యోగులు నల్లటి తలపాగాలను ధరించవచ్చని గైడ్లో పేర్కొన్నారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు బిందీలు (స్టిక్కర్లు) పెట్టుకోకూడదని, పురుషులు లేదా మహిళలు ఎవరూ మతపరమైన తిలకం లేదా టిక్కా ధరించకూడదని నిబంధనలు స్పష్టం చేశాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన బిందీ, తిలకాలను నిషేధించి ఇతర మతపరమైన గుర్తులను అనుమతించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.
I want to speak directly that this document does not reflect our present guidelines.
Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…— Peyush Bansal (@peyushbansal) April 15, 2026
పీయూష్ బన్సాల్ సంజాయిషీ
ఈ వివాదంపై ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించిన కంపెనీ సీఈఓ పీయూష్ బన్సాల్, వైరల్ అవుతున్న పత్రం తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నారు. ‘మా వస్త్రధారణ విధానం సంవత్సరాలుగా మారుతూ వస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్నది పాత డాక్యుమెంట్. ఇది మా కంపెనీ ప్రస్తుత వైఖరిని ప్రతిబింబించదు. బిందీ లేదా తిలకం ధరించడంపై మా ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దీనివల్ల కలిగిన గందరగోళానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఆయన వివరించారు.


