ఆరేళ్లలో ముద్ర రుణాలు రూ.15 లక్షల కోట్లు

Banks sanction Rs 15 lakh crore under Mudra Yojana - Sakshi

న్యూఢిల్లీ: గత ఆరేళ్లలో బ్యాంక్‌లు, వివిధ ఆర్థిక సంస్థలు ఉమ్మడిగా రూ.15 లక్షల కోట్ల ముద్ర రుణాలను మంజూరు చేశాయి. 28.68 కోట్ల లబ్ధిదారులకు ఈ రుణాల పంపిణీ జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020-21లో రూ.4.20 కోట్ల పీఎంఎంవై రుణాలు మంజూరయ్యాయి. రుణాల సగటు పరిమాణం రూ.52 వేలుగా ఉంది. దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్ షిప్‌ను ప్రోత్సహించేందుకు 2015 ఏప్రిల్‌ 8న ప్రధాన్‌మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సామాజిక, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, అట్టడుగు వర్గాలకు ఆర్థిక సమగ్రత, సహాయాన్ని అందించేందుకు  ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పీఎంఎంవై కింద ఎలాంటి తనఖా లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, చిన్న ఆర్థిక సంస్థలు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల నుంచి రుణాలు పొందవచ్చు. వ్యవసాయం అనుబంధ సంస్థలు, తయారీ, వాణిజ్యం, సేవల రంగాలలో ఆదాయం సృష్టించే చిన్న తరహా వ్యాపారాలకు ముద్ర రుణాలను మంజూరు చేస్తారు.

చదవండి: జియోకి స్పెక్ట్రమ్ అమ్మేసిన ఎయిర్‌టెల్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top