ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో కొత్త '2026 నింజా 500' బైక్ లాంచ్ చేసింది. దీని ధర మునుపటి మోడల్ కంటే రూ.1000 ఎక్కువ. దీంతో ఈ బైక్ ఎక్స్షోరూమ్ ధర రూ.5.76 లక్షలు.
కొత్త నింజా 500లో పెద్దగా యాంత్రిక మార్పులు చేయలేదు. అయితే 2026 మోడల్ను E20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేశారు. దీంతో భవిష్యత్ ఇంధన విధానాలకు అనుగుణంగా ఈ బైక్ సిద్ధంగా ఉంది. అలాగే కవాసాకి ప్రత్యేకమైన లైమ్ గ్రీన్ కలర్ స్కీమ్లో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది.
ఈ బైక్ను 2024లో విడుదల చేసిన నింజా 400కు వారసుడిగా కంపెనీ పరిచయం చేసింది. ఇందులో 451 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ను అందించారు. ఈ ఇంజిన్ 44.38 బీహెచ్పీ పవర్, 42.6 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్బాక్స్తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఇందులో ఉంది. దీంతో రైడింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
సస్పెన్షన్ వ్యవస్థలో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ను కొనసాగించారు. బ్రేకింగ్ కోసం ముందు 310 మిమీ డిస్క్, వెనుక 220 మిమీ డిస్క్ బ్రేక్లను అందించారు. ఇవి మెరుగైన నియంత్రణ, భద్రతను అందిస్తాయి.
డిజైన్ విషయానికి వస్తే, నింజా సిరీస్కు ప్రత్యేకమైన స్పోర్టీ లుక్ పొందుతుంది. ట్విన్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, షార్ప్ ఫెయిరింగ్ లైన్స్, ఆకర్షణీయమైన ఫ్రంట్ డిజైన్ బైక్కు ప్రీమియం లుక్ను ఇస్తాయి. అలాగే ఫుల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది.
ఈ బైక్లో 785 మిమీ సీటు ఎత్తు, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 171 కిలోల కర్బ్ వెయిట్ వంటి అంశాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద 2026 కవాసాకి నింజా 500లో పెద్ద మార్పులు లేకపోయినా, E20 అనుకూలతతో పాటు కొత్త రంగు ఎంపికలను జోడించడం ద్వారా కంపెనీ ఈ మోడల్ను మరింత ఆకర్షణీయంగా మార్చింది.


