
తిమ్మంపేట శివారులో క్షుద్ర పూజలు
ములకలపల్లి: మండల పరిధిలోని తిమ్మంపేట శివారులో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామశివారులో బీటీ రోడ్డుపై పూజలు చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. పసుపు, కుంకుమలతో మానవ ఆకారంలో బొమ్మ గీశారు. శుక్రవారం అర్ధరాత్రి పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తిని కట్టేసి
హత్యాయత్నం
ఇల్లెందురూరల్: భార్య, అత్తగారింటి సభ్యులు తనను కట్టేసి హత్య చేయబోయారని ఆరోపిస్తూ భర్త రామకృష్ణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన రామకృష్ణకు ఇల్లెందులోని స్టేషన్బస్తీకి చెందిన రాజేశ్వరితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య రాజేశ్వరి, అత్త ఆళ్లకట్టి సరిత, మామ సారయ్య, బావమరిది ప్రేమ్సాయి కలిసి మాట్లాడుదామని ముకుందాపురంలో ఉంటున్న రామకృష్ణను నిజాంపేటలో అతను అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిపించారు. మాటమాట పెరిగి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణను ఇంట్లో సిమెంట్ పోలుకు కట్టేసి పెట్రోల్ చల్లుతుండగా, అదే సమయంలో అక్కడికి వచ్చిన అతని మేనమామ బండారు శ్రీనివాస్ రక్షించి ఆస్పత్రిలో చేర్పించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు.
అక్రమ ఇసుక నిల్వలు సీజ్
దుమ్ముగూడెం: మండలంలోని దుమ్ముగూడెం కరకట్ట తదితర ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను శనివారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సుమారు 40 ట్రక్కుల ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేశామని తహసీల్దార్ అశోక్కుమార్ తెలిపారు. ఆయన వెంట ఆర్ఐ వెంకటేశ్వరరావు ఉన్నారు.

తిమ్మంపేట శివారులో క్షుద్ర పూజలు