
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
గుండాల : గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే తాము ఈ నాలుగేళ్లలోనే వంద శాతం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేసి చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జగ్గుతండా – లక్ష్మీదేవిపల్లి, చీమలగూడెం – ఇప్పలగుంపు మధ్య బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తూరుబాకలో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ, మామకన్నులో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. ఆళ్లపల్లి మండలంలో కస్తూర్బా పాఠశాల భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. పినపాక నియోజకవర్గానికి మొదటి విడుతగా 4,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఆ తర్వాత విడతల వారీగా ప్రతి నిరుపేదకూ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రతీ సోమవారం నిధులు విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.17వేల కోట్లు రుణమాఫీ చేస్తే తాము 10 నెలల వ్యవధిలోనే రూ.21వేల కోట్లు మాఫీ చేశామని చెప్పారు. కొత్తగూడెం–ఆళ్లపల్లి మధ్య రోడ్డు నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. గుండాల ప్రభుత్వాస్పత్రికి రెండు డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశామని, నెల రోజుల్లో ప్రారంభిస్తామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పోడు సాగు చేస్తున్న భూముల జోలికి వెళ్లొద్దని అటవీ అధికారులకు సూచించిన మంత్రి.. కొత్తగా పోడు సాగు చేయొద్దని గిరిజనులను కోరారు. ఈ మేరకు పోలీసులు, అటవీ అధికారులతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటేల్ను ఆదేశించారు. తొలత జగ్గూతండాలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ మాట్లాడుతూ.. ఈప్రాంత అభివృద్ధికి తాను గతంలో కూడా నిధులు మంజూరు చేయించానని, భవిష్యత్లో కూడా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్రాజు, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, అదనపు కలెక్టర్ విద్యాచందన, నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, గాంధీ, ఖదీర్, ముత్యమాచారి, సీపిఐ నాయకులు బొల్లోజు అయోధ్య పాల్గొన్నారు.
పొంగులేటి సభకు వర్షం అడ్డంకి..
ఇల్లెందు : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇల్లెందులోని సింగరేణి స్కూల్ గ్రౌండ్లో నిర్వహించాల్సిన పార్టీ నాయకులు, కార్యకర్తల సభకు వర్షం అడ్డంకిగా మారింది. మంత్రి పొంగులేటి హాజరు కానుండగా పెద్ద ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. సభ ప్రారంభానికి ముందే ఒక విడత వర్షం కురిసింది. అప్పటికే గ్రౌండ్కు చేరుకున్న ప్రజలు చెట్ల కిందకు చేరి వర్షం ఆగిన తర్వాత మళ్లీ సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. గంట ఆలస్యంగా ప్రారంభమైన సభలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసంగిస్తుండగా మరోసారి వర్షం కురిసింది. దీంతో జనం అంతా పరుగులు తీస్తూ ఇంటి దారి పట్టారు. కొంతమంది వర్షంలోనూ తడుస్తూ అక్కడే వేచి ఉండగా సభా వేదిక వద్దకు చేరుకున్న పొంగులేటి వారికి అభివాదం చేసి, మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ పోరిక బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు డానియేల్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సయ్యద్ జానీపాషా, మండల రాము, మడుగు సాంబమూర్తి, బానోతు సుజాత, చిల్లా శ్రీనివాస్, పడిదల నవీన్, అంకెపాక నవీన్ తదితరులు ఉన్నారు.
ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాం
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం