ఆ ఐదింటి సంగతేంటి? | - | Sakshi
Sakshi News home page

ఆ ఐదింటి సంగతేంటి?

Jun 22 2025 3:36 AM | Updated on Jun 22 2025 3:36 AM

ఆ ఐది

ఆ ఐదింటి సంగతేంటి?

భద్రాచలం: ఏళ్లు గడస్తున్నా విలీన గ్రామపంచాయతీల సమస్య ఓ కొలిక్కి రావడం లేదు. మాటల దశలోనే ఉన్న ఈ డిమాండ్‌ కనీసం చర్చలు, ప్రతిపాదనలకు సైతం నోచుకోలేదు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేసిన ఈ విలీనాన్ని రద్దు చేసి మళ్లీ తెలంగాణలో కలపాలని ఆయా గ్రామాల ప్రజలు చేస్తున్న విన్నపాలు కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లడం లేదు. అయితే ఈ నెల 25న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ‘ప్రగతి ఏజెండా’ పేరుతో నిర్వహించే సమావేశంలో అయినా విలీన పంచాయతీలపై చర్చ జరగాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ మేరకు డిమాండ్‌ చేయడం గమనార్హం.

గతంలోనే సీఎంల భేటీలో ప్రస్తావన..

తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనకు ముందు యటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం పంచాయతీలు భద్రాచలం డివిజన్‌లో అంతర్భాగంగా ఉండేవి. రాష్ట్ర విభజనలో భాగంగా పోలవరం ముంపు పేరుతో ఈ ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. దీంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం పలుమార్లు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేశారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి గోడు వినిపించారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన గవర్నర్‌, రాష్ట్రపతికి సైతం వినతిపత్రాలు సమర్పించారు. కాగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించారు. గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశమైనప్పుడు కూడా ఈ అంశం ప్రాథమికంగా చర్చకు వచ్చింది. దీనిపై పరిశీలించాలని ఇరు రాష్ట్రాల ఉన్నతాఽధికారులను వారు ఆదేశించినా సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయింది.

25న తీర్మానం చేయాలి..

ఈనెల 25న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించనున్న సమావేశంలో అయినా దీనిపై చర్చించాలని ఆయా గ్రామాల వారు అంటున్నారు. నాలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొనే ఈ సమావేశం రాష్ట్రాల నడుమ సమస్యల ప్రస్తావన, పరిశీలన, పరిష్కారానికి కీలకం కానుందని, ఈ నేపథ్యంలో విలీన పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేలా తీర్మానం చేయాలని అంటున్నారు. ఈ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేలా చర్చ జరగా లని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు శుక్రవారం హైదరా బాద్‌లో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్‌ చేసిన విషయం విదితమే.

తెగని విలీన

గ్రామ ‘పంచాయితీ’లు

ఏళ్లుగా పెండింగ్‌లోనే సమస్య

ఈ నెల 25న సీఎంలతో

ప్రధాని సమావేశం

అందులోనైనా చర్చించాలని

పలువురి విన్నపం

అభివృద్ధి పనులకు కీలకం..

భద్రాచలంలో అంతర్భాగమైన ఆ ఐదు పంచాయతీలు ఏపీలో కలవడంతో భద్రాచలం అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వ పథకాల అమలు, ఇతర నిర్మాణాలకు స్థలం కొరత ఏర్పడింది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలకు కేంద్రంగా ఉండడంతో పాటు ఆధ్యాత్మిక, పర్యాటకరంగాల్లో దేశ వ్యాప్తంగా భద్రాచలానికి పేరుంది. ఈ నేపథ్యంలో ప్రజల, భక్తుల అభిరుచికి తగినట్లుగా అభివృద్ధి చేయాలంటే ఈ ఐదు పంచాయతీలను భద్రాచలం డివిజన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి

కేంద్ర స్థాయిలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు చొరవ చూపితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 25న జరిగే భేటీలో ఏపీ, తెలంగాణ సీఎంలు ఆ ఐదు గ్రామాల వారి కోరిక మేరకు చర్చించాలి. ప్రధానమంత్రి సమక్షంలోనే పరిష్కారం చూపాలి. బిల్లు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలి.

– కొప్పుల మురళి, భద్రాచలం

ఆ ఐదింటి సంగతేంటి?1
1/1

ఆ ఐదింటి సంగతేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement